YSRCP Leaks: ఎందుకొచ్చిందో.. ఏం సాధిస్తుందో.. ఎవరికీ మంచి చేస్తుందో తెలియదు కానీ ఈ సోషల్ మీడియా మాత్రం రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలను వణికిస్తుంది..! పార్టీలు, నాయకులూ శిఖరమంత ఎక్కడానికి ఉపయోగపడుతున్న ఇదే సోషల్ మీడియా.. ఆ నాయకులే అతి తక్కువ వ్యవధిలోనే పాతాళంలోకి పడిపోడానికి కారణమవుతుంది..! గత ఏడాది ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న సినీ నటుడు పృధ్వీ, తర్వాత అంబటి రాంబాబు.. మళ్ళీ ఇటీవల అంబటి రాంబాబు.. తాజాగా మంత్రి అవంతి శీనివాస్… ఇంకా ఈ జాబితాలో మరి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. ఇది మొత్తం చేస్తున్నది, చేయిస్తున్నది టీడీపీ, జనసేన, బీజేపీ కాదు.. స్వయానా వైసీపీ నేతలే. ఆయా జిల్లాల్లో నెలకొన్న రాజకీయ కక్షలు, విబేధాలు కారణంగా సొంత పార్టీ నేతలే ఈ ఆడియోలను, వైరల్ వీడియోలను, సెక్రెట్లను బయటకు లీకు చేస్తున్నట్టు తెలుస్తుంది..!
YSRCP Leaks: మంత్రి గారివి మరిన్ని లీలలు..!?
నిజానికి మంత్రి అవంతి అంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఆడియోలు ఇప్పటివి కాదు. ఏడాది కిందటే ఇవి జరిగినట్టు తెలుస్తుంది. మంత్రి గారికి స్థానికంగా ఒక పెద్ద నాయకుడితో పొసగడం లేదు. ఈ ఇద్దరికీ ఓ విషయంలో.. ఓ రాత్రి, ఓ పార్టీలో గొడవ జరిగిందని అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.. అప్పుడే సదరు మంత్రిగారి సీక్రెట్ వ్యవహారాలను వైసిపిలో వ్యతిరేక వర్గం రాబట్టి.. వాటిని ఇలా రికార్డింగుల ద్వారా దగ్గర పెట్టుకుని.. ఇప్పుడు బయటకు వదులుతున్నట్టు సమాచారం. మంత్రి వర్గ
మార్పులకు మరో రెండో, మూడో నెలల గడువు ఉన్న నేపథ్యంలో ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే.. ట్రోల్ చేస్తే ఆ మంత్రి పదవి పోతుందనే కుట్ర కాబోలు. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, ఎత్తుగడలే.. అలా దొరికిన వారి చేతగాని తనం కూడా కావచ్చు..
* అంబటి రాంబాబుకి కూడా సేమ్ ఇదే ఫార్ములా వర్తిస్తుంది. గుంటూరు జిల్లా నుండి దాదాపు నలుగురు సీనియర్ నాయకులు మంత్రి పదవి ఆశిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మెరుగు నాగార్జున సహా మరో ఇద్దరు నాయకులూ మంత్రి వర్గంలో సీటు ఆశిస్తున్నారు. వీరికి ఆ జిల్లా నుండి ఉన్న అతి పెద్ద పోటీ అంబటి రాంబాబు.. ఈ అంబటి రాంబాబు బలహీనతని బయటకు తీసి.. ఒక ప్రణాళిక ప్రకారం ట్రాప్ చేసి.. ఇరికించారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులకు ఆయుధం అందించారు. దీంతో అంబటి అడ్డంగా బుక్కయ్యారు.
* ఇక్కడ ఈ ఇద్దరే కాదు.. వైసీపీలో మరి కొంత మంది బాగోతాలు కూడా ఆడియోలు, వీడియోల రూపంలో పార్టీ నేతల దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. రాసలీలలు, అవినీతి చరితాలు, బెదిరింపులు, పోలీసులతో బేరాలు, పేకాట రాయబారాలు, ఇలా అన్ని సోషల్ మీడియాలో చాలా త్వరగా చక్కర్లు కొట్టగలవు. ఇప్పటికే ఇటువంటి అనేక సందేశాల ద్వారా వైసిపి పరువు పోతుంది. ఇంకా మరిన్ని బయటకు వస్తే బాధ్యుడు, బాధితుడు ఒక్కరే అవుతారు.
నష్టం వైసీపీకి.. మునిగేది జగన్..!!
ఇలా సిల్లీ సిల్లీ వ్యవహారాలు.. ఆడియోల కారణంగా మంత్రి, ఎమ్మెల్యేల పరువు గంగలో కలుస్తుంది. వారి రాజకీయ జీవితం సంగతి పక్కన పెడితే అతి పెద్ద నష్టం ఎదుర్కోవాల్సింది మాత్రం సీఎం జగన్. పార్టీకి, ప్రభుత్వానికి అతనిదే బాధ్యత. రాజకీయంగా ఈ ఆపార్టీ ఇంతే.. ఈ పార్టీ నాయకుల్లో చాల మంది ఇంతే అనే ముద్ర వచ్చినప్పుడు దానికి బాధ్యుడు, బాధితుడు సీఎం జగన్ అవుతారు. అందుకే ఆయన ఇది మొక్క దశలో ఉన్నప్పుడే తుంచాలి. లేకపోతే మానుగా మారి.., పార్టీని ప్రజల్లో చులకన చేసే ప్రమాదముంది. ఇంటెలిజెన్స్, తన వద్ద ఉన్న నిఘా వర్గాల ద్వారా ఈ ఆడియోలపై వాస్తవాలు నిర్ధారించుకుని… చేసిన వారు, చేయించిన వారు.. పాల్గొన్న వారు.. బుక్కయిన వారు అందరినీ పార్టీ పరంగా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజలకు ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే కుర్రసేన, టీడీపీ సోషల్ మీడియాలతో పాటూ మహిళలకు కూడా ఆ ఆడియోలు చేరితే మళ్ళీ ఆ దెబ్బ మాన్పించుకోవడం జగన్ కి తలకు మించిన భారంగా మారుతుంది..!