వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గారు తన వ్యక్తిత్వంతో, తన నాయకత్వంతో, తన హోదాతో ప్రజల్లో స్థిరమైన పేరు సంపాదించుకోకుండా ఒక వివాదమైన అంశంతో వార్తల్లో నిలిచారు. పార్టీని ఢీ కొట్టడం ద్వారా ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను వ్యతిరేకించడం ద్వారా ఆయన ఒక్కసారిగా తెరపైకి వచ్చారు.
వివాదం ఇదిగో ముగిసిపోతుంది, అదిగో సమసి పోతుంది అనుకున్న సమయంలోనే ఆయన రకరకాల డైలాగులు చెప్పుకుంటూ, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ పార్టీతో కయ్యం పెట్టుకుంటూనే ఉన్నారు. ఇటు పార్టీ తగ్గడం లేదు. అటు ఆయన కూడా వెనుకడుగు వేయడం లేదు. అయితే రాజు గారికి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో కానీ సినిమాల్లో రచయితగా పని చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఆయన ప్రతి విమర్శ వెనుక సినిమా డైలాగులు బీభత్సముగా ఉంటున్నాయి.
*వైసిపి ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాసు, సత్యనారాయణ, వదునూరు ప్రసాదరాజు వీళ్ళందరూ మూకుమ్మడిగా రఘు రామ కృష్ణం రాజు పై విమర్శలు చేశారు. అది వివాదానికి ఆరంభం. ఆ సమయంలో రఘురామ కృష్ణంరాజు రెండోసారి వీడియో రిలీజ్ చేస్తూ “నాన్న పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది” ఒక సినిమా డైలాగ్ వదిలారు. దాంతో వార్తల్లో ఆకట్టుకునే స్థాయికి వెళ్లారు. అలా ఆయన ప్రతి వీడియోను జనం చూడడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా దొరికిందే తడవుగా కొన్ని మీడియా సంస్థలు, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే అనేక మీడియా ఛానళ్లు రామకృష్ణంరాజును హైలెట్ చేస్తూ వచ్చాయి. అయన చేత డైలాగులు చెప్పించడం, వాటిని ప్రధాన శీర్షికలుగా ప్రచురించడం ఆనవాయితీగా మారింది. నిన్నటికి నిన్న పార్లమెంట్ లో రఘురామ కృష్ణంరాజు స్థానం మారిస్తే దాన్ని కూడా ఆయన పాజిటివ్ గా తీసుకుని మరో సినిమా డైలాగును వదిలారు. “సింహానికి సింహాసనం ఎక్కడ ఉన్నా ఒకటే.. సింహం సింహమే”. అంటూ మరో నందమూరి బాలకృష్ణ డైలాగ్ కొట్టారు.
* పార్టీని ఎంపి ఢీ కొనడం అనేది సీరియస్ అంశం. ఈ ప్రభావం ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అక్కడ ఓటర్లు, ప్రజల పైన పడుతుంది. నియోజకవర్గ అభివృద్ధి పైన పడుతుంది. అధికార పార్టీ ఎంపీగా ఉన్నంత కాలం ఆయన అనుకున్న పనులు జరుగుతాయి. గుర్తింపు ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. నిధులు వస్తాయి. పనులు జరుగుతాయి. మంచి జరుగుతుంది. అందుకే ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కూడా అధికార పక్షం లోకి రావాలని కోరుకుంటారు. కానీ రఘురామ కృష్ణంరాజుకు నిధులు, పనులు, వ్యక్తిత్వం, మంచితో సంబంధం లేనట్టు ఉంది. అందుకే అధికారపక్షంతో కాలు దువ్వుకుంటూ వార్తల్లోకి ఎక్కడమే పనిగా పెట్టుకున్నారు. గడిచిన రెండు నెలలుగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఆయన అంటూ ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి పని, ఇచ్చిన నిధులు ఏమీ లేవు. కేవలం బిజెపిలో తన ఎదుగుదలను, ఢిల్లీ స్థాయిలో తన చక్రం తిరగడానికో, వైసీపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో తన హవా నడవడానికో ఎటువంటి అంతర ఉద్దేశం పెట్టుకున్నారో తెలియదు గానీ రఘు రామ కృష్ణంరాజు మాత్రం ఓ నిర్ధుష్టమైన దారిలో వెళుతూ తన ఫందాను కొనసాగిస్తున్నారు. ఇవి పార్టీకి నష్టం చేకురుస్తుందో తెలియదు గానీ ఆయనకు, నియోజక వర్గానికి మాత్రం ఎంతో కొంత నష్టం చేకూర్చడం వాస్తవం.