YSRCP: రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెల్లూరు నగర పాలక సంస్థను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలోనూ వైసీపీ పాగా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినప్పటికీ ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం తెలుగుదేశం పార్టీలో గెలిచింది. రాష్ట్రంలోని 12 జిలాల్లో రాజకీయం ఒక తీరుగా ఉంటే ప్రకాశం జిల్లాలో రాజకీయం మరో తీరుగా ఉంది. గడచిన రెండేళ్లుగా ఈ జిల్లాలో వైసీపీ బలహీన పడుతుండగా, టీడీపీ బలపడుతోంది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో లేనంతగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఐక్యంగా పని చేస్తూ.. సీఎం జగన్మోహనరెడ్డికి లేఖలు రాయడం, పదే పదే జిల్లాలోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ సీఎంను టార్గెట్ చేయడం, వీళ్ల చర్యలకు జిల్లాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే నాయకులు లేకపోవడం, కొంత మంది నాయకులు ఉన్నప్పటికీ వాళ్లను కొంత సప్రెస్ చేయడం తదితర కారణాలతో పాటు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసీపీ గ్రూపు రాజకీయాల కారణంగా వైసీపీని బలహీనం చేస్తున్నాయి. దర్శిలో ఎన్నికలు జరగడం, ఫలితాలు వెల్లడి కావడంతో అక్కడి వైసీపీ రాజకీయ పరిస్థితి బయటపడింది. చీరాల పరిస్థితి చూసుకున్నా రెండు గ్రూపులు ఉన్నాయి. కనిగిరి, గిద్దలూరు పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. గిద్దలూరులో వైసీపీ నుండి రెడ్డి సామాజిక వర్గం నాయకులు పార్టీ ఎందుకు ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక ఇష్యూ కనబడుతూనే ఉంది.
YSRCP: పార్టీ బలంగానే ఉన్నప్పటికీ..!?
ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో వైసీపీ 8, టీడీపీ నాలుగు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. టీడీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో చీరాల నుండి గెలిచిన ఎమ్మెల్యే కరణం వైసీపీలో చేరారు. దీంతో వైసీపీ బలం 9కి వెళితే, టీడీపీ బలం మూడుకు చేరింది. ఇక ఈ జిల్లాలోని వైసీపీ క్యాడర్ లో సమాధానం లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్మోహనరెడ్డికి బాబాయ్ అయిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జిల్లాకు ఎందుకు దూరంగా ఉంటున్నారు..? అనేది చాలా మందికి తెలియని ప్రశ్న. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు మాజీ ఎంపీ. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపిగా పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనను పార్టీలో తెరవెనుక క్రియాశీలకంగా పని చేయించేందుకు ఉభయ గోదావరి జిల్లాల ఇన్ చార్జి గా పంపించారు. ఆ తరువాత ఆయనకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది కుదరని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఇచ్చారు. మళ్లీ రెండు సంవత్సరాల తరువాత కూడా రాజ్యసభ ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ తీసుకుని మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆశ పడినా అదీ నెరవేరలేదు. మళ్లీ ఆయనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ బాధ్యతలనే అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత. ఆయన పుట్టింది, పెరిగింది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, ఎంపీగా ఆయన రాజకీయం ప్రారంభించింది ఒంగోలులో. ఆయనకు సొంత ఇల్లు ఒంగోలులో ఉంది. ఆయన రాజకీయం మొత్తం ఒంగోలులో నడిచింది. కానీ తన సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తన కుమారుడు లాంటి జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన సొంత జిల్లాలకు రావడం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక్క నాయకుడు కారణం. జిల్లా పార్టీలోని ఓ కీలక నాయకుడుతో ఉన్న విభేధాల కారణంగా పార్టీలో అంతర్గతంగా పెద్ద స్థాయిలో జరిగిన చర్చల కారణంగా వైవీ జిల్లాకు రాలేకపోతున్నారు. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయనకు జిల్లాకు రావాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ రాలేని పరిస్థితుల్లో ఉన్నారు.
* ఇక జిల్లాలో రాజకీయం గురించి పూర్తిగా అవపోసిన పట్టిన వ్యక్తి ఒంగోలు ఎంపీి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇప్పుడు ఆయన జిల్లా రాజకీయాల్లో సైలెంట్ గా ఉంటున్నారు, ఆయన తన వాణి ఎందుకు గట్టిగా వినిపించడం లేదు. అలానే కందుకూరు నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన మహీదర్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. అదే విధంగా ఆమంచి కృష్ణమోహన్, రెండు సార్లు చీరాల ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతానికి చీరాల నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన కూడా జిల్లాలో పార్టీ వ్యవహారాల పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. పూర్తిగా యాక్టివ్ గా తిరగడం లేదు. ఇదే నియోజకవర్గంలో పార్టీలో చేరిన కరణం బలరాం కనీసం పార్టీని పట్టించుకోవడం లేదు.., టీడీపీని ఒక్క మాటా అనడం లేదు.. ఇక పర్చూరు నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయనను పార్టీనే దూరం చేసిందన్న మాట వినబడుతోంది. జిల్లా రాజకీయాల పట్ల వీళ్లందరూ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు…!? పార్టీ పరిస్థితుల పట్ల ఎందుకు మాట్లాడటం లేదు? క్రీయాశీలకంగా ఎందుకు పని చేయడం లేదు..? అనేది పెద్ద ప్రశ్న. అయితే వీళ్లందరూ ఇలా సైలెంట్ గా ఉండటానికి ప్రధాన కారణం జిల్లాలో క్రీయాశీలకంగా ఉన్న ఓ నాయకుడి ఏకపక్ష వైఖరేనని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
పశ్చిమాన రెడ్డిలు ఎందుకు వెళ్తున్నారు..!?
గిద్దలూరు, కనిగిరి లాంటి నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో రెడ్డి సామాజికవర్గం నేతలు పార్టీ మారుతున్నారు. గిద్దలూరు వైసీపీ నుండి 800 మంది పార్టీ మారినట్లు ఇటీవల మీడియాలోనూ హైలెట్ అయ్యింది. 81వేల మెజార్టీతో గెలిచిన గిద్దలూరు నియోజకవర్గంలో రెండున్నరేళ్లలోనే వైసీపీ పట్ల ఎందుకు వ్యతిరేకత వచ్చింది. ఎందుకు పార్టీ మారుతున్నారు. కనిగిరిలో వాస్తవానికి టీడీపీ చాలా వీక్ గా ఉంది, కానీ అక్కడ వైసీపీ నుండి టీడీపీలోకి ఎందుకు చేరుతున్నారు అనేది పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలకు ఓ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇక దర్శి, చీరాల, కనిగిరి, గిద్దలూరు, పర్చూరు లాంటి నియోజకవర్గాల్లో విపరీతంగా పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఇలాంటి గ్రూపు రాజకీయాల మూలంగానే దర్శి మున్సిపాలిటీని వైసీపీ కోల్పోయింది అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం ఎన్నికలు చీరాల, పర్చూరు. కనిగిరి, గిద్దలూరు లాంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే దర్శిలో వచ్చినట్లే ఎన్నికల ఫలితాలు వచ్చేవి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గాల్లో రెండేళ్లకు పైగా గ్రూపులు ఉన్నప్పటీ పార్టీ అధిష్టానం వీటిని సరి చేసే ఆలోచన చేయడం లేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఇంత ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స రావడానికి కారణం ఏమిటి అంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో లేనంతగా ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలపై సీఎంకు లేఖలు రాయడం, వెలిగొండ ప్రాజెక్టు ను గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చాలని డిమాండ్ చేయడం, రాయలసీమ ప్రాజెక్టు విషయంలో, జిల్లాలోని గ్రానైట్ సమస్యలు ఇలా కీలకమైన జిల్లాలోని సమస్యలపై లేఖలు రాయడంతో పాటు ప్రజల్లో తిరగడంతో సక్సెస్ సాధిస్తూ వచ్చారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర జిల్లాలో విజయంతానికి టీడీపీ నేతలు కృషి చేశారు. వీటన్నింటికి మించి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి టీడీపీ హయాంలోనూ అవినీతి జరిగినప్పటికీ ఆ అవినీతి ప్రభావం నేరుగా ప్రజలపై చూపలేదు. అప్పట్లో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, కాంట్రాక్ట్ పనులు దక్కించుకుని వాటిలో కమీషన్లు తీసుకున్నారు. వీటి వల్ల ప్రజలకు నేరుగా వచ్చే నష్టం ఏమి లేదు. వారిపై ప్రభావం చూపదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న అవినీతి విషయానికి వస్తే రేషన్ బియ్యం, గ్రానైట్, కొన్ని పనులు, కాంట్రాక్ట్ లు, బదిలీలు, పోస్టింగ్ లలో జరుగుతున్న అవినీతి కారణంగా నేరుగా ప్రజలపై దాని ప్రభావం కనబడుతోంది. జిల్లాలోని దాదాపు 10 నియోజకవర్గాల్లో వైసీపీ గ్రూపులు ఉండటం, పెద్దలు మౌనంగా ఉండటం, అవినీతి ఆరోపణలు, నేతల ఏకపక్ష వైఖరి తదితర కారణాల వల్ల వైసీపీ బలహీనపడుతోందని ఈ పరిణాల క్రమంలోనే దర్శి మున్సిపాలిటీలో వైసీీపీ పరాజయం పాలైందని అనుకుంటున్నారు. కేవలం ఒక్క నేత కారణంగా జిల్లాలో పార్టీ బలహీనపడుతున్న చూస్తూ ఊరుకోవడం అధికార పార్టీలో ఏం జరుగుతుందో..!? అనే సందేహాలు కలిగిస్తుంది..!