YSRCP: వైసీపీ పార్టీ భిన్నమైనది.. ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ.. ఆ మాటకొస్తే ఊపిరి, నీరు అన్నీ సీఎం జగన్ మాత్రమే. అందుకే పార్టీ జగన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న నాయకుడి నుండి మారుమూల గ్రామంలో జెండా పట్టుకుని తిరిగే కార్యకర్త వరకు నిత్యం “జగన్నామస్మరణ” చేస్తుంటారు. జగన్ అంటే పడి చస్తారు. ఆయన మాట కోసం, కలవడం కోసం, మీడియా ముందు ఆయనను పొగడడం కోసం పడిచస్తారు.. అటువంటిది సీఎం జగన్ కి ఈ న్యూ ఇయర్ నుండి ఎందుకో కొన్ని భిన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్ అంటే పడిచచ్చి.. ఆయనను ఎప్పుడెప్పుడు ఎలా కలుస్తామా..!? ఒక్క క్షణమైనా కలిసి పూల బోకే ఇస్తామా అని ఎదురు చూసే నేతలు కూడా అయన కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయనతో వేదిక పంచుకోలేదు. ఇప్పుడు వైసీపీలో ఇదే పెద్ద హాట్ టాపిక్..!
నూతన సంవత్సరం తొలి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఫించన్ల పెంపు పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సహజంగా నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమానికి హజరైతే ఆ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు ఆయనను కలసి “న్యూ ఇయర్ విషెస్” చెప్పడానికి తహతహలాడుతుంటారు. సాధారణంగా అయితే న్యూ ఇయర్ రోజును ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మరీ విషెస్ చెప్తారు.. అది అందరికీ అంటే కష్టమే.. సో.., ఆయన తమ జిల్లాకు వచ్చినప్పుడు అయితే నాయకులు సీఎంను నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుంది. శుభాకాంక్షలు చెప్పవచ్చు. అయితే అదేరోజున గుంటూరు జిల్లాలో ఈ క్రార్యక్రమానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే సీఎం సభకు హజరుకాలేదు. ఎవరు సీఎం కార్యక్రమానికి గైర్హజరు అయ్యారు..? ఎందుకు హజరుకాలేదు..? అనే అంశాలు ఈ వరం రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రత్యేక కారణం అయితే ఏమీ లేదు. ఆయన ఎక్కడో బయట ఉండటం వల్ల సీఎం సభకు హజరుకాలేదు అని సమాచారం ఇచ్చారు. ఇక మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేదట. కానీ…..
YSRCP: నరసరావుపేట ఎంపీకి ఏమైంది..!?
లావు శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయస్సులోనే ఎంపిగా గెలిచారు. యువకుడు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. మంచి చొరవ, చనువు అన్నీ ఉన్నాయి. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ సొంత పార్టీలో కొంత మందితో ఆయనకు విభేదాలు వస్తున్నాయి. ఈ కారణాలు పార్టీ పెద్దలకు కూడా తెలుసు. గత ఏడాది గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ కార్యక్రమానికి వెళితే.. ఎమ్మెల్యే విడతల రజని వర్గం ఆయన్ను అడ్డుకుంది. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి రావడానికి వీలులేదని ఆ ఎమ్మెల్యే చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుడుని తన పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి రావద్దు అని చెప్పకూడదు కదా. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి ఆయన తీసుకువెళ్లినా ఆ ఎమ్మెల్యేకు ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు. ఇక్కడ సమస్యను పార్టీ అధిష్టానం సరి చేయకపోవడంతో ఇదే తీరు మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పాకింది. ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఆయనకు ఏ మాత్రం పడటం లేదు. ఆ విభేదాల కారణంగా వాళ్ల మధ్య దూరంగా బాగా పెరిగిపోయింది. ఇది ఒక కారణం కాగా ఆయన వర్గానికి చెందిన కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు. పదవులు లభించడం లేదు. ఆయన సిఫార్సులను పక్కనపడేస్తున్నారు. పార్టీ పెద్దలు ఈ విషయాలను పట్టించుకుని సరి చేయడం లేదన్న బాధ, ఆవేదన ఆయనలో ఉండటం వల్లనే సీఎం కార్యక్రమానికి దూరంగా ఉన్నారని భావిస్తున్నారు. “అయితే ఆయన తిరుమలలో ఉన్నందున రాలేదని తెలుస్తుంది. మరో విషయం ఏమిటంటే.. ఢిల్లీలో రెండు రోజుల పాటూ ఆయన సీఎం జగన్ తో పాటూ ఉన్నారు..!
మర్రికి మాత్రం ఆ కారణమే..!
ఇక మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే.. పార్టీ తనను మోసం చేసింది అన్న భావనలో ఆయన ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తరువాత చిలకలూరిపేటలో పార్టీ ఇన్ చార్జిగా పని చేశారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా విడతల రజనికి పార్టీ టికెట్ ఇచ్చినా మనస్థాపానికి గురి కాకుండా ఆమె గెలుపునకు కృషి చేశారు మర్రి రాజశేఖర్. అయితే మర్రి రాజశేఖర్ తన గెలుపునకు పని చేయలేదని ఎమ్మెల్యే రజని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. అందుకే సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినప్పటికీ ఆ పదవిని ఆయనకు ఇవ్వడం లేదు. రాజశేఖర్ వర్గీయులు తమ అసమ్మతిని బహిరంగంగా వ్యక్తం చేస్తుండగా ఆయన మాత్రం సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి కార్యక్రమానికి గైర్హజరు అయి తన అసంతృప్తి, అసమ్మతిని వ్యక్తం చేసినట్లు ఉన్నారు మర్రి రాజశేఖర్..!