YSRCP vs BJP: ఏపీలో నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా మారిన తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం మలుపులు తిరుగుతున్నది. ఎన్నికను రద్దు చేయాలని చంద్రబాబు ప్రెస్ మీట్లకు పరిమితం అవుతుండగా.., బీజేపీ ఒకడుగు ముందుకేసింది. ఆ పార్టీ అభ్యర్థి రత్నప్రభ ఏకంగా కోర్టుకెళ్లారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేసి.. మళ్ళి పోలింగ్ నిర్వహించాలంటూ కోర్టులో నిన్న పిటిషన్ వేశారు. దీంతో ఏపీలో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఆ ఎన్నికల సందర్భంగా వచ్చిన వీడియోలు, సోషల్ మీడియా ప్రచారంతో ఆత్మరక్షణలోకి వెళ్లిపోయిన వైసీపీకి ఈ పిటిషన్ అంశం ఇంకాస్త తలనొప్పిగా మారింది.
YSRCP vs BJP: పెద్దిరెడ్డి కౌంటర్ ఫలించలేదు..! కానీ..!!
ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధమైనవి. రాజ్యాంగంలో ఎన్నికల తతంగం చాలా కీలకమైనది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తతంగం పై విమర్శలు, తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ రోజున అనేక వీడియోలు, ఓ వర్గం మీడియాలో అనేక వార్తలు ప్రసారమయ్యాయి. కానీ అధికార పార్టీ దీన్ని అంగీకరించలేదు. మంత్రి పెద్దిరెడ్డి “ఆ బస్సులో ప్రయాణికుల తిరుపతి దర్శనానికి వస్తున్నారంటూ” చెప్పారు. కానీ ఇది పెద్దగా జనాలకు వెళ్ళలేదు. టీడీపీనే దొంగ ఓట్లు వేస్తుంది అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. దీనికి తాజాగా రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. “నిజంగా టీడీపీ దొంగ ఓట్లు వేస్తే.. వైసిపినే కోర్టుకి వెళ్లొచ్చు కదా..? ఉప ఎన్నిక రద్దు చేయమని కోరవచ్చు కదా..!? అని ప్రశ్నించారు. కీలక పాయింట్ లాగి, పార్టీని ఇరుకున పెట్టేసారు. దీంతో ఈ టాపిక్ ఇంకా సాగుతుంది.
అధికారులు చెప్పటినా… బీజేపీ మాత్రం తగ్గలేదు..!!
వైసీపీ వాదనకి అధికారులు కూడా వంతపాడారు. అక్కడక్కడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారు దొరికినట్టు వచ్చిన వీడియోల ఆధారంగా అయినా చర్యలకు ఉపక్రమిస్తే కొంచెం ఈ వ్యవహారం చల్లారేదెమో.. కానీ పోలీసులు కనీసం కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం కూడా చేయలేదు. పైగా డీజీపీ గారేమో ఎన్నికలు ప్రశాంతంగా, బాగా జరిగాయని కితాబిచ్చారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా ఈ ఎన్నికలు చాల బాగా జరిగాయంటూ చెప్పుకొచ్చారు. కొన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వీడియోలు వచ్చినా వాటిని దాటవేశారు. ఈ వ్యవహారాలన్నీ గమనించిన బీజేపీ కన్నెర్ర జేసింది. ఎన్నికలు రద్దు చేసి మల్లి పోలింగ్ నిర్వహించాలి అంటూ మొదటి నుండి చెప్తూనే ఉంది.. తాజాగా నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అభ్యర్థి రత్నప్రభ నేరుగా కోర్టుకి వెళ్లారు. హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు నంబర్ 206300127342021 గా ఇది నమోదయింది. దీనికి ప్రతివాదిగా కేంద్ర ఎన్నికల కమీషన్ ని చేర్చారు. దీంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.
వామ్మో తీర్పు తేడా కొడితే..!?
కోర్టులో ఏదైనా ఒక కేసు విచారణకు స్వీకరిస్తే మొదట వాదనలు వింటుంది. ఇరు పక్షాల వాదనలు తర్వాత ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలిస్తుంది. ఆపై ఒక తీర్పుని ఇస్తుంది. సో.. కోర్టు వాదనల్లో వైసీపీ డొల్లతనం అందరికీ తెలిసిందే. సో.. ఇక్కడ కూడా కోర్టులో తమని తాము సమర్ధించుకోడానికి వైసిపికి సరైన అధరాలు, సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది. సమర్ధనీయం వాదనలు వినిపించాలి. ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి బీజేపీ దగ్గర బోలెడన్ని ఆధారాలున్నాయి. ప్రసార మాధ్యమాల క్లిప్పింగులు, వీడియోలు ఉన్నాయి. సో.. కోర్టు వాదనల్లో బీజేపీ వాదన ఒక అడుగు ముందుకే ఉంటుంది. దీనికి వైసీపీ/ ప్రభుత్వం సిద్ధమవ్వాలి. తగిన వాదనలు సిద్ధం చేయాలి. టీడీపీ/ బీజేపీ దొంగ ఓట్లు అనే విషయంపై ప్రాధమిక ఆధారాలైనా సేకరించాలి. లేకపోతే పొరపాటున ఈ తీర్పు తేడాగా వస్తే జగన్ ఖ్యాతి జాతీయ స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది..!