టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి…! జగన్ కి స్వయానా చిన్నాన్న.., విజయమ్మకు మరిది.., వైఎస్సార్ కి తోడల్లుడు…! ఆ కుటుంబానికి అంతటి ఆప్తుడు కానీ దక్కాల్సిన ప్రాధాన్యత లేదు. పార్టీలో, ప్రభుత్వంలో అందుకోవాల్సిన పూజ్యం అందుకోవడం లేదు. పార్టీలో ద్వితీయ స్థానం అంటే విజయసాయిరెడ్డి.., సజ్జల రామకృష్ణ రెడ్డి తర్వాతనే ఉంటారు…! ఇక టీటీడీకి చైర్మన్ గిరీ ఇచ్చినా ఆది నుండి వివాదాలే. అది ఆయన వ్యూహ లోపమా, వ్యక్తిత్వమా అనేది పక్కన పెడితే ఆయన వర్గం మొత్తం చెదిరిపోవడం మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తుకి పెద్ద నష్టమే.
జిల్లాకు దూరమయ్యారు… క్యాడర్ ని వదిలేశారు…!
టీటీడీ చైర్మన్ అయ్యారు, సరే. పదవి, హోదా వచ్చింది, ఒకే. కానీ తనకంటూ ఒక రాజకీయ ప్రస్తానం, తన కుమారుడికి ఒక రాజకీయ పునాది ఉండాలి కదా. అది మిస్సయ్యారు. రాష్ట్ర స్థాయి నేతగా వెళ్ళిపోయి, జిల్లాను, తాను ఎంపీగా చేసిన ఒంగోలుని వదిలేశారు. నిజానికి వైవి సహచరులుగా ఉన్న సజ్జల, విజయసాయిరెడ్డిల తత్వం వేరు. వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి ఇష్టపడలేదు. కానీ వైవి ప్రత్యక్ష రాజకీయాలను ఇష్టపడ్డారు. గెలిచారు, ఆ గెలుపు అనుభూతిని ఆస్వాదించారు. పాదయాత్రలు చేసారు, హామీలిచ్చారు. టీటీడీ చైర్మన్ అయ్యాక జిల్లాకు ముఖ్య అథితిగా మారిపోయారు. ఆయనకు కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో సొంత క్యాడర్ ఉంది. దాన్ని నిర్వీర్యం చేసారు. ఆ క్యాడర్ ఇప్పుడు చెల్లాచెదురై వేరే నాయకుల వద్దకు చేరారు. ఇప్పుడు వైవి ఒంగోలు వెళ్తే వచ్చే వాళ్ళు ఆయన పదవి, హోదా చూసి వచ్చే వల్లే తప్పితే… సొంతంగా క్యాడర్, మనుసులు రావడం అరుదుగా మారింది. కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఒక నియోజకవర్గం ఇచ్చి, అక్కడ రాజకీయ ఓనమాలు నేర్పించే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అందుకే వ్యక్తిగతంగా మంచి పేరున్నా.., వివాద రహితుడిగా ఉన్నప్పటికీ వైవి రాజకీయ అడుగుల్లో తొలి నుండి తడబడుతున్నారు. విఫలమవుతున్నారు.
టీటీడీ కి వెళ్లిన నుండి వివాదాలమయమే…!
టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక ముందు నుండే ఆయన క్రిష్టియన్ అంటూ వివాదం మొదలయ్యింది. “కాదు బాబు నేను పక్కా హిందుని, ఇదిగో నా మేడలో రుద్రాక్ష మాల… ఇదిగో మా కుటుంబం గో పూజ, హోమం చేస్తున్న ఫోటోలు” అంటూ నిరూపించుకున్నారు. టీటీడీ చైర్మన్ అయినా తర్వాత కూడా వరుసపెట్టి వివాదాల వస్తూనే ఉన్నాయి.
* బస్సు టికెట్ల వెనుక జెరూసలేం యాత్ర ఫోటోలు ముద్ర ఉండడం… ఖండించుకున్నారు టీటీడీ భవనాలకు దూరంగా చర్చి రూపంలో కట్టడం ఉండడం.. నిజానికి ఇది ఒక ఫారెస్ట్ భవనం… దీన్ని ఖండించుకుని, వివరణ ఇచ్చుకున్నారు. అన్నమయ్య కీర్తనల్లో క్రీస్తు పాత కలిసి రావడం.., బాధ్యుణ్ణి తొలగించారు. తాజాగా ఏమిటీ అంటే సప్తగిరి అనే మాస పత్రికతో పాటు ఓ భక్తుడికి “నడి రాత్రి వేళా ఆమె దీపం” అనే క్రీస్తు ప్రచార మాస పత్రిక ఓ భక్తిడికి అందింది. దీంతో మల్లి వివాదం మొదలయ్యింది. మళ్ళీ టీటీడీ వివరణలు, ఖండించుకున్నారు. కేసులు అంటూ బెదిరింపులు మొదలయ్యాయి.
* అన్నిటి కంటే పెద్ద వివాదమయినది ఆస్తుల అమ్మకం. నిజానికి ఇది టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే. అది టీటీడీ గట్టిగా నిలబడలేక, సమర్ధించుకోలేక, వివాదం అయ్యేసరికి… శారదా పీఠాధిపతి ప్రశ్నించే సరికి వెనక్కు తగ్గారు. చివరికి ఈ సమాచారం లీక్ చేసినందుకు ఒక చిన్న ఉద్యోగిని సస్పెండ్ చేసారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకునే రీతిలో వ్యవహరించి అపకీర్తి మూటగట్టుకున్నారు. ఇలా టీటీడీ పాలనలో వైవి సుబ్బారెడ్డి మంచి ముద్ర వేయలేకపోగా.., కొన్ని అపకీర్తులు మూటగట్టుకుంటున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకు, పార్టీకి కొంత నష్టమే.