Ghantasala Venkateswararao: దినకర శుభకర అంటూ సూర్య భగవానుడిని ప్రార్థించాలన్నా.. వాతాపి గణపతిం అంటూ.. వినాయకుడిని పూజించాలన్నా.. నమో వెంకటేశా నమో తిరుమలేశా అంటూ ఏడుకొండల వాడిని స్తుతించాలన్నా.. హర హర శంభో అంటూ శివుడిని నోరార కీర్తించాలన్నా.. పాడవోయి భారతీయుడా అంటూ ప్రజల మదిలో దేశభక్తిని నింపాలన్నా.. జానపద పాటలు, వెంకీ పాటలు వినాలన్నా.. ఒక పుష్పవిలాపంతో మనసులోని బాధను బయట పెట్టాలన్నా.. నీవేనా నను పిలిచినది.. నీవే నా నన్ను తలచినది అంటూ.. ప్రియరారి గుండెల్లో ప్రేమ మాటలను, ఈటలను దింపాలన్నా.. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం అంటూ జీవితంలోని నగ్నసత్యాలను తెలుసుకోవాలన్నా.. బావ ఎప్పుడు వచ్చితివి అంటూ పలకరించే కమ్మని సొగసైనా పద్యములు వినాలన్నా.. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ స్త్రీ సమాజాన్ని ఉత్తేజ పరచాలన్నా.. మనకు వినిపించే ఒకే ఒక్క స్వరం.. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యుగళం..!!
బాల్యం:
1922 డిసెంబర్ 4న సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటప్ప గ్రామంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించారు. ఘంటసాల తండ్రి కోరిక మేరకు సంగీతం నేర్చుకున్నారు. 1941 లో సావిత్రితో వివాహం జరిగింది. ఈయనకు మొత్తం ఎనిమిది మంది సంతానం. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు.
మొదటి సంపాదన..!
1942 లో స్వర్గసీమ సినిమాతో ఓహో నా రాజా ఘంటసాల తన గలాన్ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషకం లభించింది. ఇదే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన దేశభక్తిని చాటుకున్నాడు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, గుమ్మడి , చలం , ఎస్పి రంగారావు వంటి హీరోలకు తన గానామృతంతో అద్భుతమైన పాటలను అందించారు. భానుమతి రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా చేశారు . ఆ తరువాత బాలరాజు, మనదేశం వంటి చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. కీలుగుఱ్ఱం సినిమాలో ఘంటసాల ప్లే బ్యాక్ పాడిన కాదు సుమా కల కాదు సుమా పాట మంచి పేరును తీసుకొచ్చింది. 1951లో పాతాళ భైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశం అంతా మారు మోగిపోయింది.
14రోజుల ప్రాక్టీస్..!
ఘంటసాల మంచి పాటలు పాడటం కోసం కటోర తపస్సు చేసేవారు. అందుకు ఎన్నో ఉదాహరణలు చూపొచ్చు.. ఘంటసాల పాటలు పాడటంలో తీసుకున్న శ్రద్ధ నేటి యువ గాయకులు ఆదర్శంగా తీసుకుంటే తెలుగులో మంచి పాటలు వస్తాయి. అవి ఆదర్శంగా నిలుస్తాయంటంలో సందేహంగా లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఘంటసాల పాడిన పాట శివ శంకరి పాట ను 14 రోజులపాటు రిహాసల్స్ చేసి.. ఒకే ఒక్క టేక్ లో పూర్తి చేసిన ఘనత ఆయనది.. ఆయన ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సంగీత సాధనాలు లేని ఆ రోజుల్లోనే తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించిన ఘనుడు ఘంటసాల మాత్రమే..
టిటిడి ఆస్థాన విద్వాంసుడు..
తెలుగు, తమిళ భాషల్లో ఆయన 13 వేలకు పైగా పాటలను పాడారు. అంతేకాదు 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు చిరస్థాయిలో నిలిచిపోయినవే. షావుకారు , గుండమ్మ కథ, దేవదాసు మాయాబజార్ వంటి గొప్ప చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఆయన గానానికి మెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం తమ ఆస్థాన సంగీత విభాగ విద్వాంసుడిగా గౌరవించారు. ఘంటసాల తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అనేక అన్నమాచార్య కీర్తనలను స్వామివారి ముందు పాడి భక్తిరసాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఇష్టమైన గాయకుడు.
ఈ మహా గాయకుడికి ఇష్టమైన గాయకుడు ఎవరో తెలుసా.. ప్రముఖ హిందుస్తానీ గాయకుడు బడే గులాం అలీ ఖాన్.. ఘంటసాల తో పాట పాడాలని చాలామంది పోటీపడే వాటిలో వారిలో అదృష్టం పొందిన వారు మాత్రం పి సుశీల, ఎస్పీ బాలసుబ్రమణ్యం, మానవ పెట్టి సత్యం వంటి వారు ఆయనతో కలిసి పాటలు పాడారు.
అవార్డులు రివార్డులు:
ఎన్నో పౌరాణిక చిత్ర పాటలను పాడిన ఆయనకు భారత ప్రభుత్వం 1970 లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1971 లో అమెరికా ప్రభుత్వం శాంతి పథకాన్ని అందజేసింది.
ఘంటసాల గౌరవార్థము తపాలా శాఖ తపాలా బిల్లా విడుదల చేసింది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఘంటసాల కాంస్య విగ్రహం ఉంది. నెల్లూరు శ్రీ కస్తూరిబా కళాక్షేత్రంలో కూడా ఘంటసాల కాంస్య విగ్రహం ఉంది.
ఘంటసాల ది గ్రేట్..
ఘంటసాల జీవిత చరిత్ర ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా వచ్చింది. దీనికి ఆయన అభిమాని సిహెచ్ రామారావు దర్శకత్వం వహించారు. ఇందులో గాయకుడు కృష్ణ చైతన్య అతని భార్య మృదుల జంటగా నటించరు. కానీ ఘంటసాల కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదు.
ఘంటసాల తుది అంకం..
1972లో రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గుండె నొప్పి అనిపించడంలో హాస్పటల్లో జాయిన్ అయ్యాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతున్నారు. ఘంటసాల చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పటికే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదని అనుకున్నారు. 1973లో భక్తతుకారం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు. 1974 లో ఘంటసాల జీవితంలో చివరి అంకం.. ఆ చివరి మజిలీ లో కూడా కొన్ని విశేషాలు జరిగాయి. అజరామరానమైన భగవద్గీతను ఘంటసాల పాడారు. భగవద్గీత వింటుంటే ఆ శ్రీకృష్ణుడే ఘంటసాల రూపంలో వచ్చి మనకు గీత బోధిస్తున్నట్లు అనిపిస్తుంది. 1974 ఫిబ్రవరి 11న హాస్పిటల్లో కన్నుమూశారు.
శతజయంతి వేడుకలు..
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన.. తెలుగువారి పెదాలపై నాట్యం చేసేది ఘంటసాల పాటలే.. స్వర్గంలో శారదా తుంబురనాదం మనం వినలేక పోవచ్చు కానీ.. ఈ భూమిపై ఆ గానగంధర్వుడి గానం వినగలిగే అదృష్టం మనకు మాత్రమే దక్కిందని సగౌరవంగా చెప్పుకోవచ్చు.. తెలుగువారు గర్వించదగిన స్వచ్ఛమైన తెలుగు గాయకుడు ఘంటసాల మాత్రమే. ఆయన పాటలు మన ఆస్తి.. అలాంటి గాన గంధర్వుడి పాటలు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకచోట తలుచుకుంటూనే ఉంటాం. కానీ డిసెంబర్ 4న ఆ మహానుభావుడి శతజయంతి రోజును ఒక సారి స్మరించుకోవాల్సిందే.. ఈ సంవత్సరం ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత శ్రీ కృష్ణవేణికి ప్రధానం చేశారు.