భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, హీరోల వీరోచిత పోరాటాలు ఉన్న సినిమాలు చాలా వస్తూంటాయి. భారీ యాక్షన్ సన్నివేశాలకు అబ్బురపడిపోతాం. హీరోల పోరాటాలకు విజిల్స్ వేస్తాం. అదే భారీ యాక్షన్ దృశ్యం.. హీరోలకే ఎదురైతే..! ఊహకే షాక్ తగులుతుంది. అది సినిమా.. ఇది జీవితం అని. అలాంటి సంఘటనే మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ కు ఎదురైంది. తెలుగు తెర ఇలవేల్పులైన మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, విజయశాంతి, అల్లు రామలింగయ్య, కోట, శారద.. ఇలా ఎంతో మంతి సినీ సెలబ్రిటీలు ఓ భారీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 1993 నవంబర్ 15న జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ వణుకు తెప్పిస్తుంది.
ఆరోజు అప్పటి మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి ఓ విమానం బయలుదేరింది. అప్పటికి తెలుగు సినిమా హైదరాబాద్ కు షిఫ్ట్ కాని రోజులు. షూటింగ్స్ నిమిత్తం తెలుగు సినిమా తారలు, ఇతర ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో మొత్తంగా 262 మందితో ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ బస్ A300 బయలుదేరింది. అప్పట్లో హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే.. హైదరాబాద్ వచ్చేసరికి వాతావరణం అనుకూలించ లేదు. విమానాన్ని మద్రాస్ వైపు మళ్లించారు. అయితే ఫ్యూయల్ సమస్యతో అక్కడి వరకూ వెళ్లే పరిస్థితి కనిపించ లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో తిరుపతికి సమీపంలోని వెంకటగిరి పొలాల్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసేశారు.
విషయం తెలిసిన దగ్గర నుంచీ అందరిలో ఒకటే ఆందోళన. గందరగోళ పరిస్థితి. సినిమా స్టార్లతో సహా అందరూ దేవుణ్ణి తలచుకోవడం తప్పితే వేరే మార్గం లేకపోయింది. కానీ.. కెప్టెన్ భల్లా చాకచక్యంగా పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో ఈ న్యూస్ సంచలనం రేపింది. దేశంలోని అన్ని న్యూస్ పేపర్స్ లో హెడ్ లైన్స్ వార్త అయింది. ప్రముఖంగా ప్రచురించారు. తమను క్షేమంగా కాపాడిన భల్లాకు చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు సత్కరించారు. అయితే.. ఫ్యూయల్ సమస్యపై భల్లాకు వృత్తిపరంగా విమర్శలు తప్పలేదు.