(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగు సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి (74) నేటి వేకువ జామున గుండె పోటుతో మృతి చెందారు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్లు లేకపోవడంతో కొద్ది నెలలుగా జయప్రకాష్ రెడ్డి గుంటూరులో ఉంటున్నారు. మంగళవారం వేకువజామున బాత్ రూమ్కు వెళ్లిన జయప్రకాష్ రెడ్డి ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందారు.
జయప్రకాష్ రెడ్డిది స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల గ్రామం. 1946 మే ఎనిమిదవ తేదీ జన్మించిన ఆయన బ్రహ్మపుత్రులు చలనచిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తన దైన నటనా శైలితో సినీ ప్రేక్షకులను అలరించారు. సినీ రంగానికి రాకముందు జయప్రకాష్ రెడ్డి ఉపాధ్యాయుడుగా పని చేశారు. ప్రేమించుకుందాం రా. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకెశవరెడ్డి, బిందా, గబ్బర్ సింగ్, నాయక్, బాద్షా, రేసు గుర్రం, నేనే రాజు నేనే మంత్రి, సుప్రీం, ఖైదీ నెం.150, మనం, రెడీ, టెంపర్, సరైనోడు, రాజా దీ గ్రేట్, జై సింహా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాని సంపాదించుకున్నారు. చివరగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో జయప్రకాష్ రెడ్డి నటించారు. కమెడియన్గా, విలన్గా తన రాయలసీమ యాస, భాషతో తెలుగు ప్రేక్షకులను రంజిపజేశారు.
జయప్రకాష్ రెడ్డి ఇక లేరు అని తెలియడంతో తెలుగు చిత్ర సీమలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. పలువురు సినీ రంగ ప్రముఖులు జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.