Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడంతో…”ఆదిపురుష్” చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటించింది. నిన్ననే తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లక్షలాది మంది అభిమానుల సమక్షంలో అమోఘంగా జరిగింది.
నిన్న విడుదలైన సెకండ్ ట్రైలర్ కి కూడా భారీ ఎత్తున రెస్పాన్స్ రావడం జరిగింది. రాముడు రావణుడికి మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించినట్లు ట్రైలర్ లో చూపించడం జరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ వర్క్ విషయంలో భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిన్న ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన చిన్న జీయర్ స్వామి సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించడం తెలిసిందే. ప్రత్యేకంగా హీరో ప్రభాస్ నీ పొగిడారు. ఈ తరంకి రాముడు గొప్పదనాన్ని టెక్నాలజీ ద్వారా అద్భుతంగా చాటి చెపుతున్నారు అని ప్రశంసించారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల టికెట్లు ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. శ్రీరాముని ప్రతి అధ్యాయం మానవాళికి ఒక పాఠం. ఈ తరం ఆయన గురించి తెలుసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు ఉచితంగా పదివేలకు పైగా టికెట్స్ అందిస్తాం. ఇందుకోసం గూగుల్ ఫామ్ నింపితే టికెట్లు నేరుగా పంపిస్తామని అగర్వాల్ ప్రకటన చేయడం జరిగింది. జూన్ 16వ తారీకు “ఆదిపురుష్”3Dలో విడుదల కాబోతున్న నేపథ్యంలో… నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటన సంచలనంగా మారింది.