RRR ఆస్కార్ అవార్డు గెలవడం తెలిసిందే. మార్చి 13వ తారీకు అమెరికా లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ ప్రధానోత్సవంలో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో “RRR” లో “నాటు నాటు” పాటకు అవార్డు రావడం జరిగింది. ఈ క్రమంలో పాట రాసిన చంద్రబోస్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమాకి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు రావడం సంచలనం సృష్టించింది. రాజమౌళి పేరు మారుమ్రోగింది. ఇక చరణ్, తారక్ ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ రావటంతో దేశ ప్రధాని మోడీతోపాటు చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నేతలు “RRR” సినిమా యూనిట్ నీ అభినందించడం జరిగింది.
ఇదిలా ఉంటే “RRR”లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా కీలక పాత్ర చేయడం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన తన కొత్త సినిమా “భోళా” చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో “RRR” కీ ఆస్కార్ అవార్డు రావడంపై వెరైటీగా స్పందించారు. “భోళా” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కపిల్ శర్మ షోలో అజయ్ దేవగన్ పాల్గొన్నారు. “RRR” సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకోవడానికి కారణం తానే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో అదెలా అని హోస్ట్ కపిల్ శర్మ ప్రశ్నించడంతో… “నాటు నాటు” పాటకు నేను డాన్స్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నేను చేయలేదు కాబట్టే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది అంటూ కామెడీ చేశారు. దీంతో అజయ్ దేవగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. “భోళా” ఈ నెల 30వ తారీఖు విడుదల కానుంది. ఈ సినిమాకీ అజయ్ దేవగన్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం.