Ajith Kumar: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్కు టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తుంటారు. ఇటీవల అజిల్ `వలిమై` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించాడు. బే వ్యూ ప్రాజెక్ట్స్, జి.స్టూడియోస్ బ్యానర్లపై బోనీ కపూర్ నిర్మించారు.
ఫిబ్రవరి 24న తమిళ్, తెలుగు భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. కథ రొటీన్గానే ఉన్నా.. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, బైక్ ఛేజింగ్స్, అజిత్-కార్తికేయల నటన ప్రేక్షకులను అలరిస్తాయి. దీంతో ఈ సినిమా తమిళంలో భారీ కలెక్షన్లను రాబట్టి. కానీ, తెలుగులో ఆ తర్వాతి రోజే పవన్ సినిమా విడుదల అవ్వడం వల్ల.. వలిమై కలెక్షన్లపై భారీ దెబ్బ పడింది.
ఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను ఇటీవలె అధికారికంగా కూడా ప్రకటించారు. అందులో విఘ్నేష్ ప్రియురాలు, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా అలరించబోతోంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు అజిత్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. విఘ్నేష్ సినిమాకు అజిత్ ఏకంగా రూ. 105 కోట్లు డిమాండ్ చేశాడట. ఇక ఆయనకు ఉన్న క్రేజ్ దృష్యా అంత మొత్తం ఇవ్వడానికి లైకా సంస్థ ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.