ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతోంది. రెండు నెలల క్రితం ప్రారంభమైన షెడ్యూల్ లో ఇప్పటికే చాలా కీలకమైన ఘట్టాలు తెరకెక్కించినట్టు సమాచారం. హాలీవుడ్ నటులు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. అయితే.. యావత్ ప్రేక్షకులు, టీమ్ మొత్తం ఎదురుచూస్తోంది హీరోయిన్ ఆలియా భట్ రాక కోసమే. అందరి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది అలియా. ఇందుకు సబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే.. అలియా ఖర్చుపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది.
అలియా భట్ తోపాటు ఆమె పర్సనల్ అసిస్టెంట్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ అసిస్టెంట్, నలుగురు బౌన్సర్లు కలిపి మొత్తంగా పది మంది వచ్చినట్టు సమాచారం. వీరందిరికీ నగరంలోని స్టార్ హోటల్ లో బస ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. వీరందరికీ కలిపి రోజుకు ఖర్చు లక్ష వరకూ అవుతోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావడం.. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో అలియాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత దానయ్య ఈ ఖర్చుకు ముందే సిద్ధపడినట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. అలియా సందడిపై టీమ్ సోషల్ మీడియాలో ‘వెల్ కమ్ టు డియరెస్ట్ సీత’ అంటూ స్వాగతం చెప్పింది. రాజమౌళితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
మరోపక్క హీరోలు రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఇటివలే మహారాష్ట్రలో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రావడంతోనే రామ్ చరణ్ చెల్లెలు నిహారిక పెళ్లికి రాజస్థాన్ వెళ్లిపోయాడు. ఈ హడావిడి అయిన తర్వాత తిరిగి ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అలియాపై షూటింగ్ సోమవారం నుంచే ప్రారంభమైనట్టు సమాచారం. రామ్ చరణ్ – అలియా భట్ పాల్గొనే సన్నివేశాలు, పిక్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.