తెలుగులో రిమేక్ కాబోతున్న పింక్ సినిమా హక్కులను నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు కన్ఫామ్ కాగా, హీరోయిన్ల వేటలో పడ్డారు దిల్ రాజు. పింక్లో కీలకమైన ముగ్గురమ్మాయిల పాత్రల కోసం హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాప్సీ పోషించిన పాత్ర కోసం ఇప్పటికే సమంత, పూజా హెగ్డేలతో చర్చలు సాగుతున్నాయి. ఇక మిగిలిన రెండు పాత్రల కోసం నివేతా థామస్, అంజలి పేర్లను అనుకుంటున్నారట. అంజలితో దిల్ రాజు మాట్లాడారని టాక్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న అంజలి.. తొలిసారి పవన్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్మాత దిల్ రాజు ఆఫీసులో లాంఛనంగా ప్రారంభించారు. సంగీత దర్శకుడు థమన్, డైరక్టర్ వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు కలిసి మ్యూజిక్ సిటింగ్స్లో కూడా కూర్చున్నారు. జనవరి 10 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభిస్తుండగా.. ఫిబ్రవరిలో పవన్ పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. ఆయన డేట్స్పై క్లారిటీ వస్తే షూటింగ్ శరవేగంగా జరగనుంది.