దేశ రాజధానిలో 14 సంవత్సరాల క్రితం లక్ష్మీ అగర్వాల్ అనే మహిళపై జరిగిన యాసిడ్ దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. తన ప్రేమను కాదనడంతో ఓ ఉన్మాది లక్ష్మీపై యాసిడ్ దాడికి దిగాడు. ఈ ఘటనలో లక్ష్మీ ముఖం, మెడ భాగం పూర్తిగా కాలిపోయాయి. ఎన్నో సర్జరీల తర్వాత కోలుకున్న లక్ష్మీ ఎంతో మనో నిబ్బరంతో ముందడుగు వేసింది. తనలాంటి బాధితులకు అండగా నిలిచింది. ఇప్పుడు లక్ష్మీ జీవితం ఆధారంగా ‘చపాక్’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం నిర్మాతగా కూడా ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘చపాక్’ ట్రైలర్ను విడుదల చేశారు. యాసిడ్ దాడి తర్వాత మాల్తీ(లక్ష్మీ) మానసిక సంఘర్షణ, తనలాంటి అభాగ్యులకు న్యాయం అందేందుకు ఆమె చూపించిన తెగువ ట్రైలర్లో స్పష్టంగా కన్పిస్తోంది. యాసిడ్ దాడి అనంతరం వికృతంగా మారిన తన ముఖాన్ని అద్దంలో చూసుకుని మాల్తీ భయపడి రోదించడం మనసుల్ని కలిచివేసేదిగా ఉంది. ముఖం ఎదుటివారికి చూపించడానికి కూడా ఇష్టపడని మాల్తీ.. కొంత కాలం తర్వాత దుపట్టా ఎగరేసి స్వేచ్ఛగా తిరిగే స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకోవాలంటే ‘చపాక్’ సినిమా కోసం ఎదురుచూడాల్సిందే. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. లక్ష్మీ పాత్రలో నటించిన దీపికపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆమె అభిమానులు.
previous post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!