Taraka Ratna: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్ననీ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. కాగా ఆసుపత్రిలో తారకరత్న జాయిన్ అయిన నాటి నుండి బాలకృష్ణ బాధ్యత తీసుకున్నరు. ఎలాగైనా తారకరత్న ప్రాణాలను దక్కించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో పలు ప్రత్యేకమైన పూజలు కూడా బాలకృష్ణ చేయించారు. ఇదే సమయంలో విదేశాల నుండి స్పెషలిస్ట్ వైద్యులను తీసుకువచ్చి చికిత్స కూడా అందించారు. అయినా గాని లాభం లేకుండా పోయింది.
దాదాపు 23 రోజులపాటు చావుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 వ తారీకు శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి బాలయ్య బాబు తల్లడిల్లిపోయారు. హాస్పిటల్ ప్రాంగణంలో.. బాలయ్య కన్నీరు మున్నీరయ్యారు. దాదాపు మూడు వారాలు నుండి… తారకరత్న బాగోగులను దగ్గర నుండి బాలకృష్ణ చూసుకుంటున్నారు. అయినా ప్రాణాలు దక్కకపోవడంతో నిరుత్సాహం చెందారు. తారకరత్న మరణించడం పట్ల సోషల్ మీడియాలో బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
“బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా. నందమూరి అభిమానులకు, టిడిపి కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటు. నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడు అనుకున్న తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలి”.. అని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఎయిర్ అంబులెన్స్ ద్వారా… తారకరత్న పార్థివదేహాన్ని బెంగళూరు నుండి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. తారకరత్న స్వగృహం మోకిలలో ఉంచడం జరిగింది. ఇక సోమవారం అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఇక అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.