‘ప్రభుత్వ పాలనలో కోర్టులు జోక్యం చేసుకుంటే.. ఇక ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఎందుకు, ఎన్నికలెందుకు, ప్రజల ఓట్లెందుకు’ అని ఇటివల న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యానించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే.. స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ ను బీజేపీ నాయకుడు, బీజేవైఏం అధ్యక్షుడు రమేష్ నాయుడు దాఖలు చేసారు.
వ్యవస్థల పై సామాన్యులకు అపనమ్మకం కలిగేలా స్పీకర్ మాట్లాడారని, రమేష్ నాయుడు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 2న తిరుమలలో స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేసారు. పరిపాలనలో, పాలసీలలో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, ఇలాగైతే మేము ఎందుకు అంటూ తమ్మినేని మాట్లాడిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్టాలు, వాటి అమలు తీరు విషయంలో, జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగమే, న్యాయ వ్యవస్థకు ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ప్రజలకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం పెంచేలా.. ఆర్టికల్ 129, 215 ప్రకారం స్పీకర్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని కోరారు. స్పీకర్ వ్యాఖ్యలు రాజ్యంగ స్పూర్తికి విరుద్ధంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు. తమ్మినేని వ్యాఖ్యలు ప్రజలపై, కోర్టులపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి కాబట్టే తాను కోర్టుకు వచ్చానని అన్నారు. అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు బీజేపీ – వైసీపీలా మారుతుందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.