Sai Pallavi: సాయి పల్లవి నటించిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంతో కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు కూడా హీరోయిన్లుగా నటించారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ విడుదలై మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ చేయగా.. అక్కడా సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో సాయి పల్లవి పోషించిన పాత్రకు, ఆ పాత్రలో ఆమె నటకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో ఓ దేవదాసి యువతి ‘మైత్రి’గా సాయిపల్లవి కనిపించింది. కెరీర్లో తొలిసారి ఓ సున్నితమైన పాత్రను పోషించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కానీ, తమిళనాట మాత్రం దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ వార్త ప్రచురితమైంది. దీంతో ఆ వార్తను చాలామంది ప్రేక్షకులు ఖండించారు. మరోవైపు అభిమానులైతే సాయి పల్లవిపై వచ్చిన ట్రోలింగ్స్ను తట్టుకోలేక నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్ తమిళ సై సైతం ఈ వార్తను ఖండిస్తూ సాయి పల్లవికి అండగా నిలిచారు.
తాజాగా తమిళ సై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `హీరోయిన్ సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం తనను ఎంతగానో బాధించింది. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది. గతంలో నా రూపాన్ని ఎందరో అవమానపరిచారు. కానీ, నా ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నారు. అయితే ఆ ట్రోలింగ్స్ కచ్చితంగా ఎప్పటికీ బాధను కలిగిస్తూనే ఉంటాయి` అంటూ చెప్పుకొచ్చారు.