మాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్గా మిగిలిన విషయం తెలిసిందే. కానీ లాభాల విషయంలో మాత్రం సంతృప్తికరంగానే ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ప్రారంభించిన కొత్త సినిమాపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. బడ్జెట్ విషయంలో బోయపాటి 70 కోట్లు అంటున్నారని.. అంతకు తగ్గడం లేదని గాసిప్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు బోయపాటికి తలనొప్పిగా పరిణమించాయని .. తీవ్రంగా కలత చెందుతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి కూడా దీనిపై కాస్త బెంగగానే ఉన్నారంటూ వార్తలు వండి వార్చేస్తున్నారు.
ఇంతకూ ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ రకరకాల వార్తలు, వాటి విశ్లేషణలు ఆకాశాన్నంటుతున్నాయి. యువ హీరో రామ్ చరణ్కు ఉన్న మార్కెట్ వేరని.. ప్రస్తుతం బాలయ్య మార్కెట్ వేరని.. ఓవర్సీస్, హిందీ మార్కెట్ ఇలా ఎలా ఆలోచించినా.. బాలయ్య మార్కెట్ చాలా తక్కువన్నది ఈ పుకార్ల సారాంశం. వీటిపై బోయపాటి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. అసలే గతంలో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తీసిన ‘జయ జానకీ నాయక’ నిరుత్సాహ పరచిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలయ్య సినిమాపై ఆయనకు లేనిపోని టెన్షన్ పెడుతున్నారని వాపోతున్నారట.