టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఎటువంటిదో అందరికీ తెలిసిన విషయమే. తన టాలెంట్ తో అశేష ప్రేక్షకులను సొంతం చేసుకున్న చిరంజీవికి వారి అభిమానమే శ్రీరామరక్షగా నిలిచింది. ఆయన ఇంటి నుంచి వస్తున్న హీరోలను ప్రేక్షకులు ఆదరించడానికి కారణమైంది. వారంతా చిరంజీవి పేరు చెడగొట్టకుండా రాణిస్తున్నారు. వీరిలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. గతంలో వీరి ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యాన్సే అనే భావన ఉండేది. అయితే.. గతంలో బన్నీ చేసిన కామెంట్ పవన్ – బన్నీ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపింది.. దూరం పెంచింది. ఇప్పుడు ఆ వివాదాలకు చెక్ పెట్టే సమయం వచ్చింది.
మెగా హీరోల సినిమాలకు తెగే మొదటి టికెట్ ఎవరిది..?
నిజానికి వీరందరి సినిమాల ఓపెనింగ్ షోలకు తెగే మొదటి టికెట్ సగటు చిరంజీవి అభిమానిదే అవుతుంది. ఇది మెగా హీరోలే పలుమార్లు చెప్పుకున్నారు కూడా. అయితే.. సరైనోడు ఫంక్షన్ లో బన్నీ చేసిన ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ ఫ్యాన్స్ మధ్య వైషమ్యాలు పెంచింది. కొన్నాళ్లు ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో గట్టిగానే జరిగింది. పవన్ ఫ్యాన్స్ దెబ్బ బన్నీ దువ్వాడ జగన్నాధంపై బాగా పడింది.. అయితే.. ఓ వివాదం విషయంలో పవన్ ఫిలింనగర్ చాంబర్ కు వెళ్లినప్పుడు బన్నీ వెళ్లి సంఘీభావం తెలపడం, 2019 ఎన్నికల సమయంలో పవన్ సభకు బన్నీ వెళ్లడంతో గొడవలు సద్దుమణిగాయి. పవన్ పుట్టినరోజు సందర్భంగా మరింతగా వివాదాలకు తెరపడినట్టైంది.
పవన్ బర్త్ డే కలిపింది అందరినీ..
పవన్ బర్త్ డే సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో ముగ్గురు పవన్ అభిమానులు మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. దీంతో రామ్ చరణ్, దిల్ రాజు, మైత్రీ మూవీస్, ఏఎం రత్నం.. తోపాటు అల్లు అర్జున్ కూడా మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో ఈ ఇద్దరి హీరోల మధ్య పొరపొచ్చాలు ఏమీ లేవని స్ట్రాంగ్ క్లారిటీ వచ్చింది. వీరందరూ చేసిన సాయానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి బన్నీకి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేయడంతో మెగా హీరోలంతా ఒకటే.. ఫ్యాన్స్ అంతా కలిసుండండి అనే సంకేతాలు ఇచ్చినట్టైంది.