ఖైదీ నెంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ ఓ మాట అన్నాడు. ‘ఎత్తిన ప్రతి వేలూ ముడుచుకోవాలి.. జారిన ప్రతి నోరూ మూసుకోవాలి’ అని. 39 ఏళ్ల తిరుగులేని చిరంజీవి సినీ ప్రస్థానాన్ని.. అందులోనే 9 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కొలమానంగా చూపించదగ్గ డైలాగ్ అది. సినిమాల్లో చిరంజీవిని విమర్శించలేని ఎందరికో.. రాజకీయాల్లోకి వెళ్లి ఆయనే అనేక అవకాశాలు ఇచ్చారు. ఆ కథ అయిపోయింది. కమ్ బ్యాక్ మూవీస్ తో రెండు వరుస 100 కోట్ల కలెక్షన్ల సినిమాలతో తన స్టామినా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నా.. మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై ఇటివల ఆహా ఓటీటీలో సామాజామ్ షోలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు మెగాస్టార్.
రాజకీయాలపై అభిప్రాయం అనే ప్రస్తావనకు చిరంజీవి తనదైన స్టయిల్లో సమాధానం చెప్పారు. సినిమాల్లో హైట్స్ చూశాను.. రాజీకీయాల్లో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల్లో నా వంతు ప్రయత్నం చేశాను. సినిమా మళ్లీ చేస్తున్నప్పుడు.. ఇది కదా నా సామ్రాజ్యం అనిపించింది. మళ్లీ జన్మంటూ ఉంటూ ఆర్టిస్టుగానే పుడతాను.. అంటూ తన స్టయిల్లో నో అనే సైగ చేశారు. దీంతో మెగాస్టార్ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. ఒక ఇంటర్వ్యూలో.. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. రేపేం మాట్లాడాలి.. ఏం చేయాలి అనే దానికి ఇంటికొచ్చాక ప్రిపేర్ కావాలి.. రాజకీయాల్లో ఇది కామన్. ఇంటికొచ్చేసరికి పొలిటీషియన్స్, కార్యకర్తలు ఉండేవారు.. కానీ.. సినిమాల్లో ఆ టెన్షన్ ఉండదని అన్నారు.
దీంతో చిరంజీవిలో మళ్లీ రాజకీయాల వైపు మళ్లీ వెళ్లే ఆలోచన లేదని గతంలోనే స్పష్టమైనా మీడియా ఊహాగానాలు, ప్రశ్నలు, పార్టీల నుంచి పిలుపులు.. సహజం. కానీ.. చిరంజీవి రాజకీయ వైకుంఠపాళి చూశారు. సినిమాల్లో ఆయన నిచ్చెనలు ఎక్కితే.. రాజకీయాల్లో పాములు కాటేశాయి. తనదైన సినిమా సామ్రాజ్యంలో తన స్థానం, కుటుంబం నుంచి వారసులు హీరోలుగా ఎదగడం, కుటుంబానికి ఉన్న పేరు, తనకు ఉన్న ప్రతిష్ట అన్నీ గమనించుకున్న చిరంజీవి.. ఇక రాజకీయాలకు స్వస్తి పలకడానికి కారణాలయ్యాయని చెప్పాలి. బిగ్ బాస్ ఫైనల్ లో నాగార్జున.. ‘వరుసగా సినిమాలు చేస్తున్నారు.. మళ్లీ రూలింగ్ మొదలు’ అన్నట్టు.. అసలు చిరంజీవి ఆపిందెక్కడ. టాలీవుడ్ లో ఆయన నెంబర్ వన్ స్థానం ఆయన కోసం అలానే ఉంటే..!