Chiranjeevi: చిరంజీవి Chiranjeevi బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తరహాలోనే మరో వినూత్న కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి శ్రీకారం చుడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తన వంతు సాయంగా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మరో వారం రోజుల్లోనే ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ నిల్వలు, సరఫరాపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయం.
ఈ విషయాల్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధికారిక ట్వీట్ లో వెల్లడించారు. ‘సమయానికి రక్తం దొరక్క ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరు మరణించకూడదనే సంకల్పంతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రతిజిల్లాలోనూ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే వారం రోజుల్లోనే ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు’ అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను మొత్తం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఈ ఏర్పాట్లపై చిరంజీవి టీమ్ నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పటికే కరోనా కల్లోల సమయంలో పలువురిని ఆదుకున్నారు చిరంజీవి. పావలా శ్యామలతోపాటు 15 మంది చిన్న ఆర్టిస్టుల కోసం 15 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. కోవిడ్ తో మరణించిన రామ్ చరణ్ కారవాన్ డ్రైవర్ కుటుంబానికి కూడా లక్ష ఆర్ధిక సాయం చేశారు. అభిమానులు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా ఆర్ధికంగా చేయూత అందిస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెండు దశాబ్దాల క్రితం నుంచే బ్లడ్, ఐ బ్యాంక్ తో సేవా కార్యక్రమాల్లో ఉన్న చిరంజీవి ఇప్పుడు కీలకమైన ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటుతో తన సేవా పరిధిని విస్తరించారని చెప్పాలి. చిరంజీవి నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.