Sarath Babu Passes Away: సినీ నటుడు శరత్ బాబు గత కొద్ది నెలల నుండి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శరత్ బాబు మరణం పట్ల దేశ ప్రధాని మోడీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ నటులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. శరత్ బాబు మృతి పట్ల స్పందిస్తూ.. శరత్ బాబు మరణ వార్త తనని కలిచి వేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెండితెర జమిందార్ అని కొనియాడారు. అందం అదేవిధంగా హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించారని స్పష్టం చేశారు.
శరత్ బాబుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఆపద్బాంధవుడు, అగ్నిగుండం, మా ఇంటి ప్రేమాయణం.. వంటి సినిమాలలో శరత్ బాబు మరియు చిరంజీవి కలిసి నటించడం జరిగింది. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ‘‘కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు కోలుకుంటారు అనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉంది.
నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ నటించారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటనను చూపించారు’’ అంటూ పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, రాధికా సైతం సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉంటే ఫిలిం ఛాంబర్ లో శరత్ బాబు భౌతిక కాయాన్ని ఉంచగా పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచడం జరిగింది. మంగళవారం ఉదయం శరత్ బాబు పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించి అక్కడ అంతిక్రియలు నిర్వహించనున్నారు.