మెగాస్టార్ చిరంజీవి సినిమా మెగా ఫ్యాన్స్ తోపాటు బిజినెస్ సర్కిల్స్ లో కూడా ఎంత ఆసక్తి క్రియేట్ చేస్తుందో తెలిసిందే. 9 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఖైదీ నెంబర్ 150, సైరా.. నరసింహారెడ్డి సినిమాలు చేసిన ప్రీ బిజినెస్, సాధించిన వసూళ్లే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూట్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన లూసిఫర్, వేదాళం రీమేక్స్ చేయనున్నారు. అయితే.. చిరంజీవి ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తాను చేయబోయే ప్రాజెక్ట్స్ కథలు వినిపించిన డైరక్టర్స్ పేర్లు చెప్పారు. కానీ.. ఇప్పుడు వారితో సినిమాలు చేయడం లేదని తెలుస్తోంది.
లూసిఫర్ రీమేక్ ను సుజీత్ దర్శకత్వంలో చేస్తారని వార్తలు వచ్చాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారభమైంది. అయితే.. సుజిత్ వర్క్ నచ్చలేదని కొంత, తానే తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ప్రాజెక్టు వినాయక్ చేతికి వెళ్లింది. రెండు రీమేక్స్ తో చిరంజీవికి బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో వినాయక్ పర్ఫెక్ట్ గా సెట్ చేస్తాడని భావించారు. అయితే.. వినాయక్ స్క్రిప్ట్ వర్క్ కూడా చిరంజీవికి నచ్చలేదని తెలుస్తోంది. దీంతో లూసిఫర్ రీమేక్ ను తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించినట్టు తెలుస్తోంది. వినాయక్ బెల్లంకొండ సినిమా చేస్తున్నాడని అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడంతో ఈ వార్తకు బలం వచ్చింది. మరోవైపు బాబి కూడా చిరంజీవికి కథ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
బాబీ చెప్పిన స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చలేదని అంటున్నారు. ఆచార్య తర్వాత వేదాళం, లూసిఫర్ సినిమాలు చేస్తుండటంతో బాబితో చిరంజీవి చేయనట్టేనని తెలుస్తోంది. దీంతో చిరంజీవికి యువ దర్శకుల పని తీరు నచ్చలేదా? అనే వార్తలు కూడా వస్తున్నాయి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న వేదాళం సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు కోల్ కతాలో చిత్రీకరించారనే వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే చిరంజీవి వచ్చే ఏడాది కాల్షీట్స్ బిజీనే. ఈ నేపథ్యంలోనే బాబీతో సినిమా డౌటే అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి నిహారిక పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.