YS Jagan Biopic: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ 2024 ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో 175/175 సీట్లు సాధించే దిశగా టార్గెట్ పెట్టుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలను “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం పేరిట ప్రజల మధ్య ఉండేలా.. చూసుకుంటూ ఉన్నారు. మరోపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బయోపిక్ రాబోతున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. 2019 ఎన్నికలకు ముందు “యాత్ర” సినిమా రావడం తెలిసిందే. మహి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్ అయింది.
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా సినిమా తెరకెక్కించి.. అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. కాగా ఇప్పుడు ఇదే తరహాలో వైయస్ జగన్ బయోపిక్ తీయటానికి మహి రాఘవ రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్ పాత్రలో ప్రముఖ హీరో నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇది “యాత్ర” సినిమాకి సీక్వెల్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయ్యేలా.. అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక రాజకీయంగా వైఎస్ జగన్ నేపథ్యం చూసుకుంటే.. అనేక కోణాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రిగా తన తండ్రి మరణించిన తర్వాత.. తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర. ఆ తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢీకొనటం.. జైలు పాలు కావడం జరిగింది. ఆ తర్వాత జైలు నుండి విడుదలయ్యాక రాష్ట్రం రెండుగా విభజించటం.. మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసి ప్రతిపక్ష నేతగా జగన్ రావడం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లిపోవడం ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్లకుండా ప్రజల క్షేత్రంలో అడుగుపెట్టి “ప్రజాసంకల్ప పాదయాత్ర” చేసి 2019లో ముఖ్యమంత్రిగా అఖండ విజయం జగన్ సాధించటం జరిగింది. ఇన్ని కోణాలు కలిగిన జగన్ జీవితాన్ని.. సరైన రీతిలో బయోపిక్ గా వస్తే ప్రభంజనం గ్యారెంటీ అని తాజా వార్త పై సినీ ప్రేమికులు అంటున్నారు.