బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ఫిబ్రవరి రెండో వారంలో కీలక సన్నివేశాలు, పాటల, పోరాట దృశ్యాల చిత్రీకరణకు చిత్రబృందం గోవా వెళ్లనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ… “మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. జనవరిలో హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ నెల రెండో వారంలో గోవాలో మొదలు కానున్న సెకండ్ షెడ్యూల్ లో రెండు పాటలు, కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. నెలాఖరుకు గోవా షెడ్యూల్ పూర్తవుతుంది. మార్చిలో హైదరాబాదులో మూడో షెడ్యూల్ ప్లాన్ చేశాం. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానుగుణంగా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అన్నారు.