ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం సాధారణ విషయమే. దేశంలో వివిధ భాషల్లో సినిమాలు తెరకెక్కే సినిమాలే కాదు.. విదేశీ కథలు కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. కొత్తవారి నుంచి స్టార్ హీరోలు వరకూ రీమేక్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. మంచి సబ్జెక్ట్ ను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో రీమేక్స్ చేశారు. అయితే.. ఇది మరీ ఎక్కువైతేనే విమర్శలు వస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవిపై ఇవే ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఓ డైరక్టర్ ఈ మాట అనడం విశేషం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
‘చిరంజీవి లాంటి స్టార్ వరుసగా రీమేక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన కోరితే కొత్త కథలు చాలా వస్తాయి. రీమేక్స్ కంటే ఒరిజినల్ స్టోరీస్ ఆయనకు బాగా సూట్ అవుతాయి. పైగా.. ఓటీటీలు వచ్చాక అన్ని భాషల సినిమాలు అందరూ చూస్తున్నారు. రీమేక్స్ టైమ్ అయిపోయింది. రీమేక్స్ వల్ల సినిమా స్పాన్ తగ్గిపోతుంది’ అన్నాడు. దీంతో ఆమధ్య చిరంజీవి వరుసగా రీమేక్స్ పై దృష్టి పెట్టినప్పుడు వచ్చిన విమర్శలు మళ్లీ కదిపినట్టైంది. ఆచార్య తర్వాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ ప్రాజెక్ట్స్ ప్రకటించినప్పుడు ఇవే వ్యాఖ్యలు వచ్చాయి. అయితే.. హీరోగా ఎటువంటి కథలు చేయాలనేది చిరంజీవి నిర్ణయం.
అయితే.. అమ్మ రాజశేఖర్ వల్ల ఈ వ్యాఖ్యలు మళ్లీ హైలైట్ అయ్యాయి. గతంలో చిరంజీవి అడ్వాన్స్ ఇచ్చిన విషయాన్ని రాజశేఖర్ ప్రస్తావించారు కూడా. కానీ.. అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని చెప్పుకొచ్చారు. ఆయనతో గబ్బర్ సింగ్ వంటి మాస్ సినిమా తీయాలనేది తన కోరికగా చెప్పుకొచ్చాడు. దేశంలో టాప్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్, సల్మాన్, అమీర్.. సహా రీమేక్స్ చేశారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఆచార్య ఒరిజినల్ స్టోరీనే. మరి.. అమ్మ రాజశేఖర్ వ్యాఖ్యలతో చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.