Veerasimha Reddy: నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా టైటిల్ “వీరసింహారెడ్డి”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో “NBK 107” వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకోవడం జరిగింది. అయితే అక్టోబర్ 21వ తారీకు కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద టైటిల్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. “వీర సింహారెడ్డి” అని ప్రకటించారు. ఈ టైటిల్ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. “సమరసింహారెడ్డి” సినిమాకి 200 రెట్లు “వీరసింహారెడ్డి” ఉంటుందని తెలిపారు. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.
ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సినిమాపై మీరు ఎంతైనా అంచనాలు పెట్టుకోండి దానికి మించి ఉంటుంది. బాలయ్య అభిమానిగా ఈ సినిమా తీయడం జరిగింది. అభిమానులు పండగ చేసుకునే సినిమా “వీరసింహారెడ్డి”. ఇక ఇదే సమయంలో సినిమాలో డైలాగ్ కూడా గోపీచంద్ మలినేని చెప్పారు..”వీర సింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రూలింగ్ కర్నూల్” అని చెప్పటంతో అభిమానులు గోలగోల చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని థియేటర్లలో అభిమానులతో కలిసి చూడాలని ఉంది అని అన్నారు. ఈ డైలాగ్ కి ఫ్యాన్స్ విజిల్స్ తో సభ ప్రాంగణాన్ని మారుమోగించారు.
టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. జనవరి నెలలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే సమయంలో “అఖండ” సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ కంటే అదిరిపోయే మ్యూజిక్ తమన్ అందించాడని డైరెక్టర్ తెలియజేశారు. ఇంకా సినిమాకి సంబంధించి పని చేసిన టెక్నీషియన్ ని పొగడటం జరిగింది. టైటిల్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ స్పీచ్ మొత్తంలో డైలాగ్ చాలా హైలెట్ గా నిలిచింది.