కె.రాఘవేంద్రరావు.. భారత సినీ పరిశ్రమకు పరిచయమక్కరలేని పేరు. ఎందుకంటే మాస్ మసాలా, భక్తిరస , శృంగార సన్నివేశాలను రక్తికట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. సాధారణ నటులను సైతం ఆయన తన సినిమాలతో టాప్ హీరో, హీరోయిన్లుగా మార్చారు. తెలుగు వెండితెరపై ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాలను అందించి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఈ మధ్యే సినిమాలు తీయడానికి పనులు షురూ చేసినట్టు వెల్లడిచారు.
అయితే, ఆయనకు సంబంధించిన ఓ విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది సోషల్ మీడియాలో సైతం తెగవైరల్ అవుతున్నది. అందేంటి అనుకుంటున్నారా? అదేనండి ఆయన కొత్త సినిమా గురించి ! అందులో ఏం విశేషం ఉంది.. సాధారణమే అనుకోకండి.. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన సినిమాలకు దర్శకత్వంమే వహించారు. కానీ ప్రస్తుతం ఆయన హీరోగా సినిమా తెరకెక్కనున్నది. 78 ఏళ్ల వయస్సులో ఈ దర్శకేంద్రుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో పాటు షాక్ కూడా వ్యక్త మవుతున్నది.
మరో విషయమేంటంటే ఆ సినిమాలు ముగ్గురు ముద్దుగుమ్మలతో ఈ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జత కట్టనున్నారంటూ సినివర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తున్నది. ఇటీవల ఓ కథ విన్న ఆయన ఆ కథతోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. ఈ కథలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. టాలీవుడ్ మాజీ టాప్ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, త్రిషలను ఈ సినిమా కోసం సంప్రదించినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే గనక నిజమైతే.. వెండితెరపై హీరోయిన్లను తనదైన ప్రత్యేక స్టైల్లో వారి అందచందాలను చూపించే దర్శకేంద్రుడి సినిమాలో.. హీరోన్లకు జతగా ఆయనే నటిస్తుంటే ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్ అవుతున్నారు.