రంగస్థలం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల వర్షం కురిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈసారి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి ‘వినయ విధేయ రామ’ అంటూ ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య, మెగా అభిమానుల కోరికలని నెరవేర్చడానికి, సంక్రాంతి పండక్కి వార్ వన్ సైడ్ చేయడానికి థియేటర్స్ లోకి వచ్చాడు. విడుదలకి ముందున్న అంచనాలకి కొంచెం పాజిటివ్ టాక్ తోడైతే వినయ విధేయ రామ సినిమా మరో రంగస్థలం అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా డిసైడ్ అయ్యాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.
నిజానికి చరణ్… బోయపాటితో సినిమా చేస్తున్నాడు అన్న వార్తలు బయటకి వచ్చినప్పటి నుంచే కొత్తగా ఏమీ కోరుకోకుండా జస్ట్ యాక్షన్ సీన్స్, భరో డైలాగ్స్ మాత్రం చూసి ఎంజాయ్ చేసి రావాలనుకున్నారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా కూడా కథనంలో దమ్ము ఉండేలా రాసుకునే బోయపాటి, ఈసారి అది కాస్త శృతి మించి అపహాస్యం పాలయ్యాడు. బహుశా చరణ్ కెరీర్ లోనే వినయ విధేయ రామ స్థాయిలో నెగటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో.
అయితే వినయ విధేయ రామ సినిమా విషయంలో చిరూ భయమని ఇండస్ట్రీ వర్గాలు, మెగా అభిమానులు అనుకుంటున్నారు. ఒక కథకి హిట్ అయ్యే దమ్ముందా? ప్రేక్షకులని మెప్పించగలదా లేదా అనే విషయాన్నీ చిరు చాలా పర్ఫెక్ట్ గా చెప్పగలడు, ఇంత కెపాసిటీ ఉన్న చిరు… ప్రస్తుతం తన సినిమా కోసం కష్టపడుతూనే చరణ్ చిత్రాల కథలు వింటుంటాడు. ఇదే క్రమంలో బోయపాటి శ్రీను చెప్పిన లైన్ నచ్చడంతో చిరు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చరణ్ కూడా తనని తాను కొత్తగా చూసుకోవాలనుకున్నాడేమో, పూర్తి కథని వినకుండానే వినయ విధేయని ఓకే చేశాడు. ఒక్కసారి సినిమా ఒప్పుకున్న తర్వాత పూర్తి చేయాలి కాబట్టి చరణ్, బోయపాటిని ఫాలో అయిపోయినట్లు ఉన్నాడు కానీ చిరు మాత్రం ఎప్పటికప్పుడు వినయ విధేయ రామ సినిమా విషయాలని అడిగి తెలుసుకునే వాడట. ఏం జరుగుతుంది, ఎక్కడి వరకూ వచ్చింది? ఎలాంటి సీన్స్ తీస్తున్నారు లాంటి ప్రతి విషయాన్నీ జాగ్రత్తగా అడిగి తెలుసుకునే చిరు, ఒక పాయింట్ లో మాత్రం సినిమా పూర్తిగా చేయిదాటిపోతుంది, ఫ్యామిలీకి దూరం అవుతుందని భయపడ్డాడట కానీ అప్పటికే చెయ్యి దాటి పోయే సరికి మెగా స్టార్ కూడా మౌనంగానే ఉండిపోయాడని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఎంత స్టార్ డైరెక్టర్ అయినా, ఎంత స్టార్ హీరో అయినా ఒక సినిమా చేసే ముందు ఒకరు కథని పూర్తిగా సిద్ధం చేసుకోవాలి, ఇంకొకరు అదే కథని పూర్తిగా వినాలి. అప్పుడే మార్పులు చేర్పులు చేయగలరు, చెప్పింది తీస్తున్నారో లేదో తెలుసుకోగలరు.