మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ స్థాయి గురించి తెలిసిందే. ధియేటర్ల హవా మాత్రమే ఉన్న రోజుల్లో చిరంజీవి సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్లు, సినిమా రన్, ఫ్యాన్స్ హంగామా.. ఇవన్నీ ఓ సెన్సేషన్. వేరే హీరో బ్లాక్ బస్టర్ సినిమా కలెక్షన్లు చిరంజీవి ఫ్లాప్ సినిమాకు వచ్చేవని ఇండస్ట్రీనే అనేది. దర్శకుడు గుళ్లో పూజలు చేసి సినిమా బాక్సులు తీసుకెళ్లడం.. సినిమా హిట్ అవ్వాలని దేవుడికి మొక్కడం చేసేవారు. 1995లో అల్లుడా మజాకా సినిమాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 200 లారీల్లో ఫ్యాన్స్ హైదరాబాద్ వచ్చి తన నిరసన తెలిపారు. ఇప్పుడు అదే ఫ్యాన్స్ చిరంజీవి కోసం మళ్లీ దేవాలయాల్లో పూజలు, యాగాలు చేశారు.. కారణమేమిటంటే..
చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయనే చెప్పారు. దీంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు ఇండస్ట్రీ, అశేష అభిమానులు ఆందోళన చెందారు. వెంటనే చిరంజీవి ఫ్యాన్స్ మళ్లీ కదిలారు. అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత కదిలింది. వారి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోని చిరంజీవి అభిమానులు స్థానిక దేవాలయాల్లో.. చిరంజీవి ఇష్టదైవం ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. చిరంజీవి త్వరగా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని హైదరాబాద్, ఏలూరు, రాజమండ్రి.. ఇలా ప్రతి చోటా అభిమానులు పూజలు యాగాలు చేశారు. ఈరోజు శుక్రవారం విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో చండీ యాగం, కుంకుమ పూజ చేయించారు. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ చెన్నైలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో చిరంజీవి కోసం ప్రత్యేక పూజ చేశారు.
ఇలా.. చిరంజీవి అభిమానులు ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉన్నారు. ఆమధ్య అమరావతి విషయంలో కొందరు చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో కూడా రెండు రాష్ట్రాల నుంచి అభిమానులు చిరంజీవి ఇంటికి చేరుకుని ఆయనకు కోటగా నుంచున్నారు. ప్రస్తుతం చిరంజీవి తనకు కరోనా నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని.. ఫాల్టీ కిట్ వల్లే నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలిపారు. తనకోసం పూజలు చేసిన వారందరికీ, అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దీంతో చిరంజీవి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. BOSS is BACK అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.