Vaishnav Tej: మెగా కుటుంబం నుంచి ఇప్పటికి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. ఈ మెగా హీరో ఎంట్రీ మామూలుగా లేదని చెప్పవచ్చు. తాను నటించిన మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం వైష్ణవ్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం దర్శక నిర్మాతల చూపు ఈ మెగాహీరో పై పడింది.
ఉప్పెన సినిమా తరువాత వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు “జంగిల్ బుక్ ” అనే టైటిల్ ను పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలు వారి జీవన విధానంవారి కష్ట సుఖాలను తెలియజేస్తూ వచ్చిన ఓ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. తన రెండో సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే ఈ హీరోకు మరో అవకాశం వచ్చింది.అదేవిధంగా అన్నపూర్ణ బ్యానర్ లో వైష్ణవ్ హీరోగా, నాగార్జున స్వయంగా ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం.
సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:
ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న వైష్ణవ్, క్రిష్ దర్శకత్వంలోనే కాకుండా మరొక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాను తమిళ వెర్షన్ లో తెరకెక్కించిన దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం తెలిపారు. అయితే ఈ సినిమాలో నటించడం కోసం ముందుగా దర్శక నిర్మాతలు సాయిధరమ్ తేజ్ ను సంప్రదించారు. ఈ సినిమా కథను విన్న సాయి ధరమ్ ఈ సబ్జెక్ట్ తన కన్నా తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కి కరెక్టుగా సరిపోతుందని భావించి స్వయంగా సాయి ధరమ్ ఈ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకొని తన తమ్ముడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై సాయితేజ్ చేయాల్సిన ఈ సినిమా కూడా వైష్ణవ్ తేజ్ చెంతకు చేరింది. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలోనే తెలియజేయనునట్లు చిత్ర బృందం తెలియజేసింది.