పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. “బాహుబలి” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తెలిసిందే. సాహో, రాదేశ్యాం రెండు కూడా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అట్టర్ ప్లాప్ అయ్యాయి. పైగా ఈ రెండు సినిమాలకు దాదాపు మూడు సంవత్సరాల టైం తీసుకోవడం ఫ్యాన్స్ మరింత అసహనం కలిగించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే విదేశాలకు వెళ్లి మోకాళ్ళకు సంబంధించి సర్జరీ కూడా చేయించుకోవడం జరిగింది.
దీంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గత కొద్ది నెలల నుండి ప్రభాస్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయా సినిమాల నిర్మాతలపై దర్శకులపై సీరియస్ అవుతూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో మరో రెండు రోజులలో అనగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖు నాడు “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” అప్ డేట్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“సలార్” కి సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభించిన టైములో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా పరిస్థితులు మారడంతో సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా విభిన్నంగా కనిపించనున్నట్లు.. హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ తో “సలార్” నీ ప్రశాంత్ నీల్ తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.