Samantha: సమంత.. గత కొద్ది రోజుల ఈ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. భర్త నాగ చైతన్యతో విడిపోయిన అనంతరం కెరీర్ పరంగా జోరు పెంచిన సమంత.. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేస్తున్న చిత్రాల్లో `యశోద` ఒకటి. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్లు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సమంత ఫ్యాన్స్ను ఖుషీ చేసే ఓ అదిరిపోయే గుడ్న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఈ పాన్ ఇండియా సినిమా విడుదలకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. గత ఏడాది డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తి చేసుకోనుంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది.
ఆగస్టు 12న ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆగస్టు 11న అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి నటించిన `లాల్ సింగ్ చద్ధా` చిత్రం విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు అంటే ఆగస్ట్ 12న అఖిల్ అక్కినేని హీరోగా చేస్తోన్న యాక్షన్ మూవీ `ఏజెంట్` రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాలకు పోటీగా యశోద దిగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.