Manchu Vishnu: గత ఏడాది అక్టోబర్ మాసంలో జరిగిన “మా” ఎన్నికలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సంచలనం రేపాయి. విష్ణు ప్యానల్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా నెలకొని చివర ఆఖరికి విజయం విష్ణుని వరించింది. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలలో అనేక గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో “మా” అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు.. ఇండస్ట్రీకి సంబంధించి అనేక విషయాలలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కృష్ణంరాజు మరణించిన నేపథ్యంలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించిన సంతాప సభలో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనని “మా” అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని మొట్టమొదట ఫోన్ చేసి చెప్పింది కృష్ణంరాజు గారని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో దాసరి తర్వాత తాను ప్రేమించే వ్యక్తి కృష్ణంరాజు అని స్పష్టం చేశారు. అయితే ఆయన ఓ రోజు ఫోన్ చేసి “రేయ్ ఈసారి మా ఎన్నికలలో నువ్వు నిలబడుతున్నావు” అని చెప్పారని, ఈ క్రమంలో తన తండ్రి మోహన్ బాబు వద్దని పట్టుబట్టిన కృష్ణంరాజు గారే పోటీ చేయించారని విష్ణు చెప్పుకొచ్చాడు.
ప్రతి నెల 10వ తారీకు “మా” అసోసియేషన్ పనుల రిపోర్ట్ ఇస్తామని, ఈసారి కలుద్దామని సిద్ధమయ్యే లోపే ఆయన లేరని సంతాప సభలో విష్ణు విచారం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మోహన్ బాబు మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనని ఒరేయ్ అని పిలిచే చనువు కేవలం కృష్ణంరాజు గారికి మాత్రమే ఉందని అన్నారు. తనని మొట్టమొదటిసారి బెంజ్ కార్ ఎక్కించింది కూడా ఆయనే అని చెప్పుకొచ్చారు. కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. మంచి నటుడు, గొప్ప నిర్మాతను కోల్పోయాం. ఆయన ఎక్కడున్నా శాంతి కలగాలని సకల దేవుళ్ళను కోరుకుంటున్నట్లు సంతాప సభలో మోహన్ బాబు పేర్కొన్నారు.