ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ వైవిధ్యమైన పాత్రలతో తనలోని నటుడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఆ తరహాలోనిదే. విలన్గా కార్తికేయ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఏ పాత్రకైనా రెడీ అంటున్న కార్తికేయకు తమిళ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. అజిత్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు ఎంపిక చేశారని సమాచారం. అజిత్-శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో విలన్గా కార్తికేయ కనిపించబోతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని కార్తికేయను ఎంపిక చేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్2లో కార్తికేయ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మిస్తున్నారు. కార్తికేయ ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా కనిపించనున్నాడని చిత్రబృందం తెలిపింది. ఇటీవల విడుదలైన కార్తికేయ చిత్రం ‘90ఎంఎల్’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.