ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సినిమా మాధ్యమం ఎప్పుడూ ముందుంటుంది. మూకీ నుంచి టాకీ, బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, 35 ఎమ్ఎమ్ నుంచి సినిమా స్కోప్, స్టీరియో ఫోనిక్ సౌండ్ నుంచి డీటీఎస్, రీల్ నుంచి డిజిటల్, ట్రిక్ ఫొటోగ్రఫీ నుంచి కంప్యూటర్ గ్రాఫిక్స్.. ఇలా సినిమాల్లో ఎన్నో కీలక ఘట్టాలు జరిగి ‘సినిమా’ మహోన్నతంగా ఎదిగింది. అలా.. సినిమాను కొత్త పుంతలు తొక్కించిన ఇండస్ట్రీలు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, కథలు ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ కూడా ఓ అరుదైన ఘనతను సాధించింది. దేశంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కు ఆద్యం పోసింది. ఆ సినిమానే ‘అమ్మోరు’. 1995 నవంబర్ 23న విడుదలైన ఆ సినిమాకు 25 ఏళ్లు పూర్తయ్యాయి.
శక్తివంతమైన కథలను సినిమాలుగా మలచిన ఎంఎస్ ఆర్ట్స్ సంస్థ, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. ఈ విప్లవానికి నాంది పలికారు. తమ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసే కోడి రామకృష్ణకు ‘అమ్మోరు’ బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటికే హాలీవుడ్ లో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా సినిమా చేయాలని భావించారు. తెలుగు మార్కెట్ కు బడ్జెట్ ఎక్కువైనా వెనుకడుగు వేయలేదు. లండన్ లో సినిమాకు అవసరమైన గ్రాఫిక్స్ వర్క్ ను చేయించారు. బ్లూ, గ్రీన్ మ్యాట్స్, డిజిటల్ మేకింగ్ లేని రోజులవి. రీల్ మీదే సీజీకి అవసరమైన సీన్లు, షాట్లను తెరకెక్కించారు. కష్టమైన పనిని ఇష్టంగా చేసారు కోడి రామకృష్ణ. లండన్ లో గ్రాఫిక్ వర్క్స్ చేయించారు శ్యాంప్రసాద్ రెడ్డి.
సినిమా విడుదలయ్యాక.. ఇప్పటి ‘అవతార్’ ను కళ్లింత చేసుకుని చూసినట్టు.. అప్పట్లో ‘అమ్మోరు’లో గ్రాఫిక్స్ చూశారు ప్రేక్షకులు. నీళ్లలో నుంచి చేయి వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ‘అమ్మోరు’ గెటప్ లో రమ్యకృష్ణ నెక్స్ట్ లెవల్. గ్రాఫిక్స్ లో చేసిన ప్రతి సన్నివేశం టెక్నాలజీతో అద్భుతాలు చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రాష్ట్రంలోని ప్రతి ధియేటర్ బయట ‘అమ్మోరు’ గుళ్లు వెలిసాయి. అప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ ఎంతో మారినా.. కంప్యూటర్ గ్రాఫిక్స్ కు వెలుగు తెచ్చిన సినిమాగా ‘అమ్మోరు’ నిలిచింది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ లో జాతీయ అవార్డు కూడా దక్కింది.