Tottempudi Venu: తొట్టెంపూడి వేణు.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన `స్వయంవరం` అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వేణు.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడు.
వేణు దాదాపు 26 సినిమాల్లో నటించగా.. వాటిల్లో చాలా వరకు హిట్లే ఉన్నాయి. అయితే మంచి సక్సెస్ రేటు ఉన్న వేణుకు `గోపి గోపిక గోదావరి` మూవీ తర్వాత అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. దాంతో ఆయన గ్రాఫ్ దారుణంగా డల్ అయిపోయింది. అయితే స్టార్ హీరోగా తనకంటూ టాలీవుడ్లో ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణుకు ఉన్నట్టుండి ఆఫర్లు తగ్గిపోవడానికి గల కారణాన్ని ప్రముఖ ఆర్టిస్ట్ అనంత ప్రభు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. వేణు గొప్ప నటుడని, కానీ, ప్రస్తుతం అవకాశాలు లేకపోవడం వల్ల భార్య అనుపమతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నాడని అనంత ప్రభు చేపుకొచ్చాడు. అయితే సినిమాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించడం వల్లే అతనికి మైనస్ అయిందని దీని వల్ల ఆయనకు ఆఫర్లు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారని ప్రభు పేర్కొన్నారు.
కాగా, హీరోగా సినిమాలు చేయడం మానేశాక వేణు.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన `దమ్ము` చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించారు. అలాగే ఇన్నాళ్లకు మళ్లీ రవితేజ హీరోగా శరత్ మందవ దర్శకత్వంలో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న `రామారావు ఆన్ డ్యూటీ` అనే సినిమాలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు.