మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ పై సుకుమార్ తో పాటు, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా కృతీ శెట్టి నటిస్తూ టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ఇక సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్ ఇప్పటికే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక, నిర్మాతలు అనుకున్నారు. కాని కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దీంతో థియోటర్స్ మూతపడి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా ‘ఉప్పెన’ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఇప్పటికే కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండటమే. తాజాగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’,’భానుమతి అండ్ రామకృష్ణ’ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి.
అందుకే ఉప్పెన కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని న్యూస్ స్ప్రెడ్ అవగా ఈ విషయంలో మేకర్స్ క్లారిటి ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా మేకర్స్ థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాకే రిలీజ్ చేస్తామని వెల్లడించారట. ఇందుకు ముఖ్య కారణం మెగా మేనల్లుడి డెబ్యూ సినిమా కావడమేనట. ఇక ‘ఉప్పెన’ సినిమాని దాదాపు 20 కోట్లు బడ్జెట్ తో నిర్మించారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. అయితే 2020 లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈ మెగా హీరో కి 2020 బ్యాడ్ ఇయర్ గానే మిగిలేలా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.