Sukumar: పుష్ప 2 ఇప్పట్లో సెట్స్ మీదకు రానట్టే.. అందుకు కారణం ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2..చిత్రాలే అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ సర్క్యూలేట్ అవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్లో మాత్రమే కాకుండా సౌత్ భాషలలో కూడా పాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం జరుగుతోంది. దాంతో ఒక సినిమా వచ్చి భారీ హిట్ సాధిస్తే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అంతకంటే గొప్ప సినిమా తీయాలనే కసి మిగతా మేకర్స్లో విపరీతంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆల్రెడీ తయారు చేసుకున్న స్క్రిప్ట్కు మెరుగులు దిద్దేందుకు మళ్ళీ కొన్నాళ్ళు సమయం తీసుకుంటున్నారు.
ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా అదే పనిలో ఉన్నట్టు తాజా సమాచారం. అల్లు అర్జున్ హీరోగా ఇద్దరు కలిసి చేసిన ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప: ది రైజ్ పార్ట్ 1. అసలు ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాల్సి వస్తుందని చిత్రబృందమే అనుకోలేదు. కానీ, చిత్రీకరణ మొదలుపెట్టి సగం అయ్యాక అప్పుడు ఈ కథను రెండు భాగాలుగా తీయొచ్చుననే ఆలోచనకు వచ్చారు. అలా, పుష్ప 2 కూడా ఉందని మేకర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు.
Sukumar: పుష్ప 2 కోసం మళ్ళీ కొత్త కథ ..!
అయితే, ఫిబ్రవరి నుంచి సీక్వెల్ షూటింగ్ మొదలవ్వాల్సింది. కానీ, పక్కాగా స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో ఆలస్యం అయింది. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ పుష్ప సీక్వెల్ కోసం మళ్ళీ ఫ్రెష్గా కథ సిద్దం చేసేందుకు విదేశాలకు వెళ్ళినట్టు సమాచారం. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ – కేజీ ఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాలు భారీ హిట్ సాధించాయి. పాన్ ఇండియన్ రేంజ్లో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన వసూళ్ళ సునామీ అంతా ఇంతా కాదు. దాంతో ఇప్పుడు తయారు చేసుకున్న కథతో ఆ రికార్డులను ఎదుర్కోవాలంటే అయ్యేపని కాదని సుక్కూ భావించి పుష్ప 2 కోసం మళ్ళీ కొత్త కథ తయారు చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో సుకుమార్ – బన్నీ ల పుష్ప 2 మొదలయ్యేలా లేదనిపిస్తోంది.