పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళు సినిమాలకి గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ ఇస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాతో లాయర్ గా మన ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ‘ఓ మై ఫ్రెండ్’ ‘ఎంసీఏ’ చిత్రాల ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో 26వ సినిమాగా రూపొందుతుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ సమర్పిస్తున్నారు.
ఇక ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా రాబోతోంది. ఇదే సినిమా కోలీవుడ్ లోను అజిత్ తో నిర్మించగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో 100 కోట్ల కి పైగా వసూళ్ళని రాబట్టడం విశేషం. ఇక ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి, నివేదా థామస్ అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు.
ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వకీల్ సాబ్ ని 2021 సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు టీం సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ అని ముందు నుంచి అనుకుంటున్నప్పటికి ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరమీదకొచ్చింది. ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ కి బదులుగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతోందట. మరి ఈ మార్పు ఎందుకు జరిగిందో అన్నది తెలీదు కాని తమన్నా పవన్ కళ్యాణ్ ల మీద త్వరలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ – తమన్నా కలిసి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.