2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు తమ వంతు పాత్రను సమర్ధవంతంగా పోషించారు. మోహన్బాబు, జయసుధ, డా.రాజశేఖర్, జీవిత, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, అలీ తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో వీరందరూ నామినేటెడ్ పోస్టులేమైనా దొరుకుతాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవికి అంబికా కృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పదవి పైన పేర్కొన జాబితాలో ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ పదవిని జయసుధకు ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి. వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. ఓసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. సినిమా రంగంలో కూడా జయసుధకు సత్సంబంధాలున్నాయి. కాబట్టి ఎఫ్.డి.సి చైర్మన్గా జయసుధ పేరు రేసులో ముందుంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.