Nikhil : ఏడేళ్ల క్రితం నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా దర్శకుడు చందూ మెండేటి తెరకెక్కించిన కార్తికేయ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు చందు మెండేటి కార్తికేయ2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం వరుస షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్న కార్తికేయ 2 చిత్రబృందం అతి పెద్ద సమస్యలో ఇరుక్కుపోయింది. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుండడంతో ఒక్కసారిగా మంచు ఎక్కువగా కురవడం వల్ల చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ కు కొంత విరామం ఇచ్చారు.
కార్తికేయ చిత్రంలో నిఖిల్ సరసన స్వాతి హీరోయిన్ గా నటించగా, ఈ సీక్వెల్ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ జతకట్టారు.విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మాయ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకే దర్శకుడు సవ్యసాచి సినిమాను ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించగా ఆ సినిమా దర్శకుడికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలోనే కార్తికేయ 2 ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్:
కార్తికేయ 2 చిత్ర బృందం ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని సిస్సులో జరుగుతుంది. హీరో హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు కూడా హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్నారు.ప్రస్తుతం ఎక్కువగా మంచు కురవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న చిత్రబృందం కొన్ని రోజుల పాటు సినిమా చిత్రీకరణకు విరామం ఇచ్చారు. మంచు తుఫాన్ తగ్గిన తర్వాత భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. కార్తికేయ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చగా కార్తికేయ 2 చిత్రానికి కి కాలభైరవ సంగీతం అందించనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఈ చిత్ర బృందం ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన వీడియోను బి.ఏ.రాజు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అర్జున్ సురవరం సినిమా ద్వారా హిట్ సంపాదించిన నిఖిల్ అదే జోరులో కార్తికేయ 2 చిత్రంలో నటిస్తున్నారు. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా చేయబోతున్న ఈ సినిమా పై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకున్నారు.