Kota Srinivasarao: కోట శ్రీనివాసరావు Kota Srinivasarao ప్రకాశ్ రాజ్ మా ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజకీయ ఎన్నికలనే తలపిస్తాయి. ఎన్నికల ముందు ఉన్న తుఫాను తీవ్రత.. తీరం దాటి అల్లకల్లోలం సృష్టించి శాంతించినట్టు.. ‘మా’ ఎన్నికలు తుఫానులా అనిపించినా ఎన్నికలు అయిపోగానే.. టీ కప్పులో తుఫానునే తలపిస్తాయి. మళ్లీ అందరూ కలిసిపోతారు, కలిసికట్టుగా పని చేస్తారు. ఏవో.. చిన్న చిన్న స్పర్ధలు తప్ప అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. అయితే.. ఈసారి నాన్ లోకల్ ఇష్యూ ప్రకంపనలు రేపుతోంది. ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేయడం.. ఆయనకు మెగా ఫ్యామిలీ మద్దతు ఉందనే వార్తలు మరింత హీటెక్కిస్తున్నాయి. అయితే.. ప్రకాశ్ రాజ్ పోటీ చేయడం ఇండస్ట్రీ పెద్దలకు ఇష్టం లేదా? అంటే.. కోట శ్రీనివాసరావు మాటలు అలానే అనిపిస్తున్నాయి.
‘మా’లో జరుగుతున్న రగడపై ప్రముఖ సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు స్పందించారు. ‘మా ఎన్నికలను అసలు ఎవరు ప్రకటించారు? ఇప్పుడున్న కమిటీ పదవీకాలం పూర్తైందా? వారే ఎన్నికలను ప్రకటించారా? కొత్తగా ఓ ప్యానెల్ అంటూ ప్రకటించారు. ఇదే నాకు కొపం తెప్పించింది. దీనిపై ఇప్పుడు కాదు.. టైమ్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇప్పడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి మద్దతిచ్చారో లేదో నాకు తెలీదు.. కానీ మా పై నాగబాబు వ్యాఖ్యలు సరికాదు’ అని అన్నారు. దీంతో కోట శ్రీనివాసరావు ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికల తంతపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. నటులకు భాషా బేధం ఉండదు.. నిజమే..! కానీ.. పరిశ్రమకు సంబంధించిన వ్యవస్థలు, పాలకమండలిపై ఇతర భాష నటులకు అధికారం ఉండద్దొనేది చాలామంది ఉద్దేశం.
Read More: Maa Elections: ‘మా’పై ప్రకాశ్ రాజ్ పెత్తనమా..? హిందూ సంఘాల ఆగ్రహం..!
కోట శ్రీనివాసరావు ఎప్పుడూ తెలుగు నటులకు ప్రోత్సాహం ఇవ్వాలనే అంటారు. ఇదే విషయమై గతంలో ఆయనకూ కొందరికి మధ్య వాదనలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏకంగా ‘మా’ అసోసియేషన్ పగ్గాలు పరభాషా వ్యక్తి చేపడతానంటే కోట ఒప్పుకుంటారని ఊహించలేం. దీంతో కోట వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. ప్రకాశ్ రాజ్ పోటీ చేయడంతోనే ఇప్పుడు మా ఎన్నికల్లో కొత్తగా ప్రాంతీయ బేధాలు కూడా వస్తున్నాయి. నటుడు సీవీఎల్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ కూడా ఇదే అంటున్నారు. తెలంగాణ నటులకు అవకాశాలు దక్కడం లేదనీ.. అందుకు అధ్యక్షుడినైతే పోరాడుతానని అంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో ‘మా’ ఎన్నికలు ఎన్ని టర్న్స్ తీసుకుంటాయో చూడాలి..!