సినీ పరిశ్రమలో నిలబడాలంటే తమదైన ముద్ర వేయాల్సిందే. నటీనటులైనా, టెక్నీషియన్లు అయినా, నిర్మాత అయినా ఇది తప్పదు. మరే రంగంలోనూ చూపనంత క్రియేటివిటీని సినిమాల్లో చూపించాల్సి ఉంటుంది. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది సినిమా. ముఖ్యంగా దర్శకుడి క్రియేటివిటీ ఇందుకు దోహదపడుతుంది. దర్శకుడి ఆలోచనలే సినిమా ద్వారా కోట్లాదిమందిని ఆకర్షిస్తాయి. అందుకే దర్శకుడిలో క్రియేటివిటీ ముఖ్యం. తెలుగులో అటువంటి దర్శకుల్లో మొదటివరుసలో నిలిచే దర్శకుడు ‘కృష్ణవంశీ’. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా వచ్చినా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. దర్శకుడిగా ఆయన కెరీర్ నేటితో 25 ఏళ్లు పూర్తయ్యాయి.
కృష్ణవంశీ తొలి సినిమా ‘గులాబి’ 1995లో విడుదలైంది. అనగనగా ఒకరోజు సినిమా సగం తీసినా అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. శిష్యుడి టాలెంట్ గుర్తించిన వర్మ ఆ సినిమాను, ‘గులాబి’ని కృష్ణవంశీ చేతిలో పెట్టారు. కృష్ణవంశీలోని తపన, ఆలోచనలకు నిదర్శనంగా గులాబి ఉంటుంది. యూత్ ని టార్గెట్ చేసి తీసిన ‘గులాబి’ విజయవంతం అయింది. స్నేహితుల సరదాలు, ప్రేమ, యాక్షన్.. అన్నీ ఒక సినిమాలో చూపించి ఆకట్టుకున్నారు. ‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ పాట చిత్రీకరణ అప్పట్లో ఓ సెన్సేషన్. ‘ఈవేళలో నీవు..’ పాటను చూసి ప్రేమికులు ఊహల్లో తేలిపోయేలా చేశారు. ఇక కాలేజీ, ఫ్యామిలీ సందడి సరేసరి. దీంతో భవిష్యత్తులో తన అవసరం టాలీవుడ్ కి ఎంత అవసరమో నిరూపించారు.
దర్శకుడిగా అందరూ భయపడే ద్వితీయ విఘ్నాన్ని కృష్ణవంశీ ఘనంగా దాటారు. ఆ సినిమానే ‘నిన్నే పెళ్లాడతా’. సినిమాలోని ఫ్యామిలీ, లవ్ సెంటిమెంట్ కృష్ణవంశీ పేరు మోగేలా చేసింది. ‘సిందూరం’ మంచి సినిమాగా నిలిచింది. అంతఃపురం కృష్ణవంశీకి జాతీయస్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఖడ్గం సినిమాతో సంచలనం సృష్టించారు. ‘మురారి’, ‘చందమామ’ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను పర్ఫెక్ట్ గా చూపించారు. చిన్న సినిమాగా తీసిన డేంజర్ తో యాక్షన్ తెరకెక్కించారు. ఇలా తన 25 ఏళ్ల ప్రయాణంలో తీసినవి తక్కువ సినిమాలే అయినా ఇది ‘కృష్ణవంశీ’ సినిమా అనే బ్రాండ్ ను సంపాదించుకోవడం విశేషం. ‘కృష్ణవంశీతో ఒక్క సినిమా అయినా చేయాలి..’ అని నటీనటులు అనుకునే స్థాయికి చేరుకున్నారంటే అతిశయోక్తి కాదు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!