“లైగర్” సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదల అవ్వక ముందే దాదాపు నెల రోజులకు పైగా సినిమా టీం మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం జరిగింది. నార్త్ ఇండియా మొదలుకొని సౌత్ ఇండియా వరకు ప్రధాన నగరాలలో హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్య పాండే భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన “లైగర్”.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హీరో పరంగా విజయ్ దేవరకొండ న్యాయం చేసిన గాని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మార్క్ సినిమాలో కనిపించలేదని చూసిన జనాలు అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే మొదటిరోజు “లైగర్” అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. తొలిరోజు ఈ సినిమా కోసం ₹13.35 కోట్ల షేర్, ₹24.50కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. ఇక నైజాం..ఏపీలో కలిపి ₹9.55 కోట్ల షేర్, ₹15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం లో ₹4.20 కోట్ల షేర్, ₹7 కోట్ల గ్రాస్, సీడెడ్ లో ₹1.30 కోట్ల షేర్, ₹1.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. కచ్చితంగా ఈ లెక్కలు నిరాశ కలిగించే కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. మొదటి రోజు ఇలా ఉంటే “లైగర్” ఓవరాల్ కలెక్షన్స్ ఇంకా ఎలా ఉంటాయో అన్న టెన్షన్ నిర్మాతలలో నెలకొన్నట్లు టాక్.
ఇదిలా ఉంటే అక్టోబర్ తొలి వారంలోనే డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ కి “లైగర్” రూపంలో భారీ ఫ్లాప్ పడటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు పాటు టైం కేటాయించడంతోపాటు.. భారీ వర్కౌట్స్ విజయ్ చేయడం జరిగింది. అయినా కానీ సినిమా పరాజయం పాలు కావటం ఎంతో నిరాశ కలిగించింది.