(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
హైదరాబాదు: తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య ఉన్న విబేధాలు మరో సారి బహిర్గతం అయ్యాయి. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా మూవీ ఆర్టిస్ అసోసియేషన్ (మా) నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్బాబు, టి సుబ్బరామిరెడ్డి, జయసుధ, కృష్ణంరాజు, రాజశేఖర్, జీవిత, పరుచూరి వెంకటేశ్వరరావు, మురళీమోహన్ తదితరులు హజరయ్యారు.
సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ సినిమా అసోసియేషన్ ఓ కన్స్ట్రక్టివ్గా సాగిపోవాలన్నారు. ‘మాలో మంచి ఉంటే మైక్లో చెబుదాం, మాలో చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం’ అని చిరంజీవి సూచించారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలు ఉన్నా కలిసి పోవాలని చిరంజీవి సూచించారు. ‘మా’లో మూల నిది పెరిగేకొద్దీ గొడవలు పెరుగుతున్నాయని ఎవరి పేరునూ చెప్పకుండా వ్యాఖ్యానించారు. త్వరలో విదేశాల్లో అందరూ హీరోలతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి నిధిని పెంచుదామని చిరంజీవి సూచించారు. విబేధాలతో సభ రసాభాసగా మారితే మీడియాలో ఇదే పెద్దగా ప్రచారం జరుగుతుందని అన్నారు.
చిరంజీవి వ్యాఖ్యలపై రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిప్పును కప్పి ఉంచితే పొగ రాకుండా ఉంటుందా అని రాజశేఖర్ వ్యాఖ్యానించడంతో వేదికపై రభస మొదలయ్యింది. రాజశేఖర్ను చిరంజీవి, మోహన్బాబులు వారించే ప్రయత్నం చేశారు. ‘మీరు మాట్లాడే సమయంలో నేను కల్పించుకోలేదు, ఇప్పుడు మీరూ కల్పించుకోవద్దు’ అంటూ కాస్తంత ఘాటుగా రాజశేఖర్ పేర్కొన్నారు. ‘వినండి, మీరు అరిస్తే ఏదీ జరిగిపోదు, నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి’ అంటూ మోహన్బాబును ఉద్దేశించి రాజశేఖర్ అన్నారు. ఈ సమయంలో జయసుధ వేదికపైకి వచ్చి రాజశేఖర్ చేతిలోని మైక్ను తీసుకోవాలని ప్రయత్నించారు. మోహన్ బాబు స్టేజీ దిగి వెళ్లిపోయేందుకు లేచారు. ఈ సందర్భంలో రాజశేఖర్ మాట్లాడుతూ ‘అసోసియేషన్లో ఏది ఫ్రాంక్గా జరగడం లేదు, తాను సత్యంగా బతకాలని అనుకుంటున్నాను, నిజాన్ని చెబుతున్నాను, తానేమీ చిన్న పిల్లాడిని కాదు, ఏ విషయాన్ని అయినా కప్పిపుచ్చాలని చూస్తే ఊరుకోను’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంలో చిరంజీవి కల్పించుకుని తాను చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందన్నారు. ఎంతో సజావుగా సాగుతున్న సభలో ఆగ్రహాంగా మైక్ లాక్కొని, గౌరవం లేకుండా, ప్రొటోకాల్ లేకుండా మాట్లాడటం మర్యాద కాదని హితవు పలికారు రాజశేఖర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కావాలనే గొడవ చేయడానికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
అనంతరం జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ రాజశేఖర్ మనస్థత్వాన్ని అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ఆయనకు మనసులో ఏమి దాచుకోవడం తెలియదు, మనసులో ఏది ఉంటే అది మాట్లాడతారు, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దని అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ సినీ అవార్డులకు సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అసోసియేషన్ నేతలు చర్చించాలని సూచించారు. అదే విధంగా రాబోయే మా అసోసియేషన్లో అందరూ మహిళలే ప్రతినిధులుగా ఉంటే వెరైటీగా ఉంటుందని అన్నారు. విబేధాలు లేకుండా అసోసియేషన్ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.