Mahesh: టాలీవుడ్ నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గతవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఘట్టమనేని కుటుంబం తీరని దుఃఖంలోకి వెళ్ళిపోయింది. కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన అస్థికల్ని కృష్ణా నదితో పాటు మిగతా నదుల్లో నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు కృష్ణా నదిలో ఆయన ఆస్తికలను నిమజ్జనం చేశారు మహేష్ బాబు.
మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. అక్కడి నుంచి కారులో విజయవాడకు వచ్చారు. మహేష్ బాబు వెంట ఆయన బావలు సంజయ్ స్వరూప్, జయదేవ్, సుదీర్ బాబు, చిన్నాన్న ఆదిశేషగిరిరావు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఉన్నారు. మహేష్ తన తల్లి అస్థికలను గంగా నదిలో కలపగా.. ఇప్పుడు తన తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపారు.
మరోవైపు సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు కలిసి నటించిన సినిమాలలోని పాత్రలను మ్యాచ్ చేస్తూ మెమొరబుల్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ రకరకాల మీమ్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ ఏడాదిలోనే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన తన తల్లి, తండ్రి, అన్నను కోల్పోయారు. ఇలాంటి గడ్డు సమయంలో కూడా అభిమానులు మేమున్నాము అంటూ ధైర్యాన్ని అందిస్తున్నారు.