`మహర్షి` సినిమా ట్రీట్లా ఉంటుంది – మహేశ్
“నాకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి నలభై నిమిషాల పాటు కథ చెప్పారు. విన్నంత సేపు బాగా అనిపించింది. కానీ అప్పటికే మరో సినిమాలు కమిట్ అయ్యున్నాను. కాబట్టి అవి అయ్యే వరకు ఆగమని అన్నాను. వంశీ సరేనని.. నా కోసం రెండేళ్ల వరకు ఆగాడు. అలా మా కాంబినేషన్లో సినిమా రావడానికి మూడేళ్ల సమయం పట్టింది“ అన్నారు మహేశ్. ఈయ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `మహర్షి`. మే 9న విడుదలవుతోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు. సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో మహేశ్ మాట్లాడుతూ…
నాలో నమ్మకాన్ని నింపాడు…
– డైరెక్టర్ వంశీ పైడిపల్లి నాలో నమ్మకాన్ని నింపాడు. `మహర్షి` సినిమాలో మూడు పాత్రలు చేశాను. అందులో స్టూడెంట్ పాత్ర నాకు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది. ఆ సమయంలో డైరెక్టర్ వంశీ నాలో నమ్మకాన్ని పెంచారు. దీంతో స్టూడెంట్ పాత్రను చాలా సులువుగా చేసేశాను. ఒకే గెటప్తో సినిమాలు చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ అలాంటి కథలే నా వద్దకు వస్తున్నాయి. కానీ మహర్షిలో మూడు పాత్రల్లో కనపడతాను. ప్రేక్షకులకు, అభిమానులకు ట్రీట్లా ఈ సినిమా ఉంటుంది.
రెండు భిన్నమైన కథలు..
– ఇప్పటి వరకు విడుదలైన `మహర్షి` ప్రచార చిత్రాలు `శ్రీమంతుడు`ని పోలి ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ రేపు సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. రెండు భిన్నమైన కథలు. తప్పకుండా మహర్షి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమాలో మంచి మెసేజ్ ఉంది. అది తప్పకుండా సమాజంపై ప్రభావం చూపుతుంది.
అందుకే మరచిపోయాను..
– ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అందరి దర్శకుల గురించి మాట్లాడతున్న సమయంలో స్టేజ్పైకి ఫ్యాన్స్ ఒక్కసారిగా వచ్చేశారు. దాంతో పూరి జగన్నాథ్, సుకుమార్ పేర్లు మరచిపోయాను. సుకుమార్గారు డైరెక్ట్ చేసిన `వన్.. నేనొక్కడినే` కల్ట్ క్లాసిక్. నా సినిమాల్లో ఉత్తమ చిత్రం.
సుకుమార్తో భవిష్యత్తులో చేస్తా..
– నేను ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలనుకుంటున్న సమయంలో సుకుమార్గారు బలమైన ఎమోషన్స్ ఉండే సినిమా చెప్పారు. అందుకే సుకుమార్ కథను పక్కకు పెట్టి అనిల్ రావిపూడి కథతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. నా డిసిషన్కు సుకుమార్ కూడా ఓకే అన్నారు. ఫ్యూచర్లో తప్పకుండా ఇద్దరం కలిసి సినిమా చేస్తాం.
ఆ సినిమాలంటే భయం..
– హిస్టారికల్ సినిమాలు చేయాలంటే నాకు కాస్త భయమే. అయితే నాకు సరిపోయే కథతో ఏ దర్శకుడైనా వస్తే తప్పకుండా హిస్టారికల్ మూవీ చేయడానికి ఆలోచిస్తాను.
నాన్న హ్యాపీ..
– మే 9న మహర్షితో బ్లాక్బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. నాన్నగారు సినిమా చూశారు. ఆయన హ్యాపీ. ఈ సినిమా విడుదల తర్వాత నా సినిమాలను మే నెలలోనే విడుదల చేయమని పట్టుబట్టే అవకాశం ఉంది.
నిర్మాతగా..
– నా బ్యానర్లో వెబ్సిరీస్లు, చక్కటి కథలతో సాగే చిన్న సినిమాలు తీయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాం.
అలాంటి స్క్రిప్ట్ మళ్లీ రాలేదు..
– మల్టీస్టారర్ చేయడం అంత సులభం కాదు. వెంకటేష్గారితో చేసిన `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమా తర్వాత మరో మల్టీస్టారర్ స్క్రిప్ట్ రాలేదు. మంచి కథ దొరికితే తారక్, చరణ్లతో చేయడానికి నేను సిద్ధమే.
తదుపరి చిత్రాలు..
– సందీప్, త్రివిక్రమ్ కథలు చెబుతామన్నారు. ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అలాగే రాజమౌళిగారితో ఎప్పుడో సినిమా చేయాల్సింది. కుదరలేదు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి.