దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’. రీమేక్ కథతో తన రీ-ఎంట్రీని ఘనంగా చాటిన చిరు 2017లో టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీనే షేక్ చేశాడు. ఇప్పుడే ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమా సైరాతో ఏకంగా ఇండియన్ హిస్టరీనే మారుస్తున్నాడు. అదేంటి ఇండియన్ హిస్టరీ ఎలా మారుస్తాడు అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జట్ సినిమా ‘సైరా’, స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలా వాడ నరసింహారెడ్డి’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే వెర్ మ్యాజిక్ స్టార్ట్ దేర్ లాజిక్ ఎండ్స్ అనే మాట ఇండస్ట్రీలో ఉంది, అది అక్షర సత్యమే కానీ సైరా సినిమా విషయంలో మేజిక్-లాజిక్ అనేది కాకుండా ఏకంగా చరణ్-చిరులు చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన టీజర్ లో సైరా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఇండియాస్ ఫస్ట్ సివిల్ రెబల్లియన్ వార్ ఫిల్మ్ అంటూ టైటిల్ కార్డు వేశారు… అంటే స్వాతంత్ర్య పోరాటం చేసిన మొదటి వీరుడి కథగా సైరా రాబోతుందని అర్ధం. ఇక్కడి వరకూ అంతబాగానే ఉంది కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా ముందు ఉద్యమాలు చేసిన వాళ్లు లేరా? ఆయనే మొదటిసారి తెల్లదొరలపై పోరాటం చేశాడా అంటే… చరిత్ర నుంచి కాదనే సమాధానం వినిపిస్తుంది. అవును 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన తిరుగుబాటు కన్నా ముందు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఉయ్యాలవాడ కన్నా దశాబ్దాల ముందే స్వాతంత్ర్య ఉద్యమాలు మొదలయ్యాయి… దేశవ్యాప్తంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి.
బెంగాల్ మిడ్నపూర్ చువార్ల దగ్గర నుంచి మొదలు పెడితే, చోటా నాగపూర్ ముండా ఆదివాసీలు, తామర్లు, పహాడీ సర్దార్లు, కేరళ మలై బ్రాహ్మణులు, కొక్కియర్లు, రాంచి కోల్ తిరుగుబాటు, పాట్నా ఖంద్ రివొల్యూషన్, ఒడిశ్శా గోండుల తురుగుబాటు, అస్సాం కాశీల తిరుగుబాటు, బెంగాల్ పగల్-పంత్ తిరుగుబాటు, భిల్లులు, కచ్ తిరుగుబాటు, వాఘేరా తిరుగుబాట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా ఉద్యమాలు, నేలకొరిగిన వీరుల కథలే ఉన్నాయి. వీరిలో నాలుగేళ్ల పాటు తెల్లదొరలతో పోరాటం చేసి 33ఏళ్లకే వీరమరణం పొందిన టిరోట్ సింగ్ ఉన్నాడు, వీరనారి రాణి వేలు నాచియర్ ఉంది, జగన్నాధ గజపతి నారాయణ్ ఉన్నాడు, వీర పాండ్య కట్టబొమ్మన్ ఉన్నాడు, మరదు సోదరులున్నారు, మరుదనాయగం కూడా ఉన్నాడు. ఈ మరుదనాయగం కథతోనే కమల్ హాసన్ ఒక సినిమా కూడా ప్లాన్ చేశాడు, క్వీన్ ఎలిజబెత్ 2 వచ్చి లాంచ్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా చరిత్రకెక్కిన ఈ సినిమా అనివార్య కారణాల వలన ఆగిపోయింది. ఇలా దేశం కోసం జరిగిన పోరాటం చూస్తే చరిత్ర నిండా నేలకొరిగిన వీరుల కథలే ఉన్నాయి అంతేకాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మాత్రమే స్వాతంత్ర్య ఉద్యమం మొదలుపెట్టలేదు.
పోనీ సైరా చిత్ర యూనిట్ చెప్తున్నట్లు ఉయ్యాలవాడ చేసింది మొదటి సివిల్ తిరుగుబాటా అంటే అది కూడా కాదు, కరెక్ట్ గా చెప్పాలి అంటే అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సామాన్య మనిషే కాదు. నరసింహారెడ్డి ఒక పాలెగాడు, తనకి రావాల్సిన భరణం ఇవ్వకుండా బ్రిటిషర్లు అతన్నీ, అతని మనుషులని అవమానపరిస్తే, అప్పుడు 1846లో 5000 మందితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం మొదలుపెట్టాడు. ఈ ఉద్యమం మొదలైన ఏడాదికే అంటే 1847లోనే బ్రిటిషర్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పట్టుకొని కోవెలకుంట్ల కోటికి ఉరివేసి చంపేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తక్కువనో, ఆయనేమి చేయలేదనో చెప్పట్లేదు.. ఆయన నిజంగా గొప్ప వీరుడు, తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు, కేవలం ఏడాది వ్యవధిలో ఆయన చేసిన పోరాటానికి భయపడి, మరో ఉయ్యాలవాడ లాంటి వ్యక్తి జనం నుంచి రాకూడదని ముప్పై ఏళ్ల పాటు ఆయన తలని ఒక కోట గోడకి వేలాడదీశారు అంటేనే బ్రిటిషర్లని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంత భయపెట్టారో అర్ధం చేసుకోవచ్చు.
అందుకే స్వాతంత్ర్య పోరాటం గురించి భారతీయులు మాట్లాడుకున్నన్ని రోజులు ఈ రేనాటి సూర్యుడు కథ చెప్పుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు, అయితే సినిమా కోసం, సినిమాటిక్ లిబర్టీ పేరుతో చరిత్ర మార్చడం… డబ్బులు సంపాదించడం కోసం ఫస్ట్ సివిల్ రెబల్లియన్ వార్ స్టోరీ అనే విధంగా ఈ సైరా సినిమాని ప్రమోట్ చేయడం మాత్రం చాలా తప్పు. అసలు హిస్టరీ అనే మాటకి వస్తే 1857లో సిపాయి తిరుగుబాటే చరిత్రలో అతిపెద్ద సివిల్ రెబల్లియన్ వార్.. ఇది చరిత్ర చెప్తున్న నిజం. సినిమా కోసం చరిత్రని మార్చే అధికారం ఎవరికీ లేదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప వీరుడు, ఆయన కథని అలానే చెప్పండి అంతే కానీ సినిమా కోసం స్వాతంత్ర్య పోరాటం మొదలుపెట్టిందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనో, లేక ఆయన తప్ప ఇంకెవరూ పోరాడలేదనో మాత్రం చెప్పకండి.